Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సేంద్రీయ ఉత్పత్తుల మేళాను ప్రారంభించిన.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ-సిద్దిపేట
జనాభా అవసరాలకు సరిపడా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో వ్యవసాయక విప్లవం పేరుతో రసాయనిక ఎరువులు, ఆధునిక వంగడాలను ప్రవేశ పెట్టారని, కానీ వాటిని వాడే విధానంపై రైతులకు అవగాహన కల్పించడంలో గత పాలకులు విఫలమయ్యారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట పట్టణంలోని మల్టీ పర్పస్ హైస్కూల్లో బాల వికాస ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే 'సేంద్రీయ రైతుల మెగా మార్కెట్ ఆర్గానిక్' మేళాను రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజరు, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచమంతా భూసార సంరక్షణ, టెర్రరిజం నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తుంటే, భారత దేశాన్ని పాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం మహారాష్ట్ర, కర్నాటక మధ్య మతం, కులం చిచ్చు పెడుతుందని విమర్శించారు. జనాభా పెరుదలకు అనుగుణంగా ఆహార ఉత్పత్తుల్ని పెంచేందుకు మొదట్లో వాడిన సేంద్రియ పద్ధతులను పక్కన పెట్టి క్రిమి సంహారక మందుల వాడకం మొదలు పెట్టామన్నారు. మందుల వాడకం మోతాదుకు మించడంతో ప్రపంచ వ్యాప్తంగా మరో 50 పంటలు మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా భూసార పరీక్షలు జరిపి అవసరమైన మందులను వాడుతూ సేంద్రియ పంటల సాగుకు రైతులు రావాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. మోతాదుకు మించి ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సారమైందని, సారవంతమైన భూమిలో 7 శాతం కార్బన్ ఉండాల్సి ఉండగా ప్రస్తుతం దేశంలో సగటున ఒక శాతం మాత్రమే ఉన్నదన్నారు. ఎక్కువ ఎరువులు వేస్తే ఎక్కువ ఉత్పత్తి వస్తుందనే ఆలోచనలో రైతులు ఉన్నారన్నారు. ప్రపంచానికి ఆహార పదార్థాలను ఒక్క భారతదేశం మాత్రమే సప్లై చేయగలదన్నారు. ఆ దిశగా మెరుగైన వ్యవసాయ విధానాలు అనుసరించట్లేదన్నారు. ఏ ప్రయత్నం అయినా మొదటి చిన్నగానే ప్రారంభం అవుతుందని ప్రజలు దాన్ని ఆచరించినప్పుడే అది ఒక చరిత్రగా నిలుస్తుందన్నారు.
సిద్దిపేటకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకునేందుకు తాను వస్తున్నానన్నారు. హరీశ్ రావును అనుసరిస్తూ సిద్దిపేటలో జరిగే అభివృద్ధిని కాపీ కొట్టి మా నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. తెలంగాణలో 50 ఏండ్ల కిందట పశువుల పేడ, పచ్చిరొట్ట ఎరువులు వాడేవారని గుర్తుచేశారు. అనంతరం బాలవికాస ఆధ్వర్యంలో ప్రారంభించిన మేళాను మంత్రులు పరిశీలించారు. 150 మంది రైతులకు సేంద్రియ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బాల వికాస డైరెక్టర్ శౌరి రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.