Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తగూడ-గచ్చిబౌలి ఫ్లై ఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ రూపురేఖలే మారిపో యాయని, అందుకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశమే కారణమని మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. కొత్తగూడ నుంచి గచ్చిబౌలి వరకు రూ.263 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఫ్లై ఓవర్ను ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఫ్లై ఓవర్ శిలా ఫలకాన్ని ఆవిష్కరించగా ప్రాజెక్టు సీఈ దేవానందం, ఎస్సీ వెంకట రమణ రిబ్బన్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రానున్న ఏప్రిల్ వరకు సివరేజ్ పనులు పూర్తయితే దేశంలోనే వందకు వంద శాతం సివరేజ్ కలిగిన మొట్ట మొదటి నగరంగా హైదరాబాద్ నిలుస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని మౌలిక వసతులు హైదరాబాద్లో కల్పిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్కు విద్య, ఉపాధి కోసం పలు రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తున్నారని, ఈ నేపథ్యంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. రాబోయే 50 ఏండ్లను దృష్టిలో పెట్టుకొని నీటి సమస్య లేకుండా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారన్నారు. 2022 జనవరి 1న షేక్పెట్ ఫ్లై ఓవర్ను ప్రారంభించామని, ఇప్పుడు 2023 జనవరి 1న ప్రధాన ఫ్లై ఓవర్తో పాటుగా ర్యాంపు నిర్మాణం, అండర్ పాస్తో మొత్తం 3.3 కిలోమీటర్ల ఫ్లై ఓవర్ను ప్రారంభించినట్టు తెలిపారు. ఎస్ఆర్డీపీ ద్వారా 47 పనుల్లో ఇప్పటివరకు 34 పనులు పూర్తయ్యాయన్నారు. దాంతో నగరంలో 18వ ఫ్లై ఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని వివరించారు. ఎస్ఆర్డీపీ ద్వారా రూ. 8 వేల కోట్ల వ్యయంతో చేపట్టినట్టు, మిగిలిన 11 ప్రాజెక్టులు 2023 చివరి వరకు పూర్తి చేయనున్నట్టు తెలిపారు సివరేజ్ కోసం 31 ఎస్టీపీలను రూ. 3885 కోట్ల వ్యయంతో చేపట్టినట్టు చెప్పారు. ప్రజా రవాణా మెరుగు కోసం ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ 70 కిలోమీటర్ల పొడవు గల ఎయిర్ పోర్ట్ మెట్రోకు శ్రీకారం చుట్టారన్నారు. అంతేకాకుండా నగరంలో 3 వేల ఎలక్ట్రికల్ మోటార్ వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి తెలిపినట్టు కేటీఆర్ తెలిపారు. ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ మాట్లాడుతూ.. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎస్ఆర్డీపీ ద్వారా 10 ఫ్లై ఓవర్లకు గాను 9 పూర్తయ్యాయన్నారు. తాగునీటి సమస్య లేకుండా 18 రిజర్వాయర్లు సీఎం కేసీఆర్ చేపట్టినట్టు, ప్రతి వార్డులో రూ. 150 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్ నెట్వర్క్ పెరగడం మూలంగా అన్ని రంగాల్లో అభివృద్ది జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఫ్లై ఓవర్ కోసం భూసేకరణ సకాలంలో చేసిన డిప్యూటీ సిటీ ప్లానర్ గణపతి, రవీందర్ టీపీయస్ను విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, వాణి దేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, జోనల్ కమిషనర్ శంకరయ్య, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, హమీద్ పటేల్, సింధు, నాగేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.