Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మానవతా కోణంలో ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తూ, వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ డాక్టర్ కే వాసుదేవ రెడ్డి తెలిపారు. తమ శాఖ బడ్జెట్ రూ.20 కోట్ల నుంచి రూ.83 కోట్లకు పెరిగిందని గుర్తుచేశారు. బుధవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా లూయిస్ బ్రెయిలీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్గా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం హైదరాబాద్లోని వికలాంగుల సంక్షేమ భవన్లో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అందులో వికలాంగుల సహకార సంస్థ జేఎండీ శైలజ, జీఎం ప్రభంజన్ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు. కేక్ కట్ చేశారు. అనంతరం వాసుదేవరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రూ.500 ఉన్న పెన్షన్ను రూ.3016కు పెంచామని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 5 లక్షల 51 వేల మంది వికలాంగులకు ఏటా రూ.2000 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదన్నారు. వికలాంగుల సహకార సంస్థ ద్వారా ఉమ్మడి పాలనలో 30 శాతం సబ్సిడీతో మాత్రమే సహాయ ఉపకరణాలు అందేవనీ, ఇప్పుడు 100 శాతం సబ్సిడీతో ఉచితంగా అనేక సహాయ ఉపకరణాలను అందిస్తున్నామని తెలిపారు. 2014 నుంచి నేటి వరకు రూ.36 కోట్ల విలువ గల సహాయ ఉపకరణాలను 40,845 లబ్ధిదారులకు అందజేశామని చెప్పారు. ఉమ్మడి ఏపీలో బదిరులకు చెవి మిషన్లు, ఎంపీ3 ప్లేయర్లు మాత్రమే పంపిణీ చేసేవారనీ, మారుతున్న కాలానికి అనుగుణంగా నేడు వారికి వీడియో కాల్స్ చేసుకునే విధంగా 4జీ స్మార్ట్ ఫోన్లను అందజేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యలో నాలుగు శాతం, ఉద్యోగాల్లో ఐదు శాతం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఐదు శాతం రిజర్వేషన్లను వికలాంగులకు కేటాయిస్తున్నారని తెలిపారు.
తనకు మూడో సారి పదవి రావడానికి సహకరించి వికలాంగులకు సేవ చేసే భాగ్యం కలిగించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు వాసుదేవరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.