Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగంలో సెక్యూలరిజం, సోషలిజం పదాలు మాయం
- వామపక్షాల పోరాట ఫలితమే సంక్షేమపథకాలు
- సమస్యలపై నిరంతరం స్పందించే గొప్పవిధానమే కమ్యూనిజం : రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్కుమార్
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / సిరిసిల్లటౌన్
దేశాన్ని మతోన్మాదంగా మారుస్తున్న బీజేపీ మరోసారి దేశంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని పీఠిక నుంచి సెక్యూలరిజం, సోషలిజం పదాలు మాయం అవుతాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సమస్యలపై నిరంతరం స్పందించే గొప్ప విధానమే కమ్యూనిజమని కొనియాడారు. దోపిడీ నుంచి విముక్తి చేసే ఆలోచనలకు పదును పెట్టి తీసుకొచ్చిన సిద్ధాంతమే మార్క్సిజమని చెప్పారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు, కరీంనగర్ జిల్లా మొదటి పార్లమెంట్ సభ్యులు బద్దం ఎల్లారెడ్డి 44వ వర్ధంతి సభను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. వామపక్ష నాయకులు బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య వంటి అనేక మంది పోరాటాల వల్లనే దేశంలోగానీ, ఆయా రాష్ట్రాల్లోగానీ ఆయా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలకు కారణం కమ్యూనిస్టుల పోరాటాలేనని గుర్తుచేశారు. ప్రజలకు సంక్షేమాలను అందించలేకపోతే కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ప్రజలు ఎక్కడ తిరగబడతారో అన్న అభద్రత ఆయా ప్రభుత్వాల్లో ఉంటుందన్నారు. ఎవరికైనా అధికారం ముఖ్యం కాదని, వ్యవస్థ ధ్వంసం కావొద్దు అని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో కుహనా దేశభక్తులు ప్రమాదకరంగా మారారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా బీజేపీ అనుసరిస్తున్న విధానాలు దేశానికి ప్రమాదకరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. భిన్న మతాలు భిన్న సంస్కృతులు ఉన్న దేశంలో కులాలు, మతాల పేరిట విభజించు.. పాలించు పద్ధతిలో కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యవహరిస్తోందని చెప్పారు. దేశంలోని లక్షలాది కోట్ల విలువైన సంపదను సర్వనాశనం చేస్తుందని, ప్రజలకు అన్యాయం చేస్తోందని అన్నారు. దేశ సంపదను అప్పనంగా అంబానీ, ఆదానీలకు అప్పగిస్తుందని, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో నయాభారత్ నిర్మాణం కోసం అడుగులు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రజా గాయకురాలు విమలక్క తదితరులు పాల్గొన్నారు.