Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్,వరంగల్కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి : కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ
- తెలంగాణపై కేంద్రం వివక్ష
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
తెలంగాణలోని పట్టణాలకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు ఆదివారం కేంద్రానికి ఆయన లేఖ రాశారు. హైదరాబాద్తోసహా రాష్ట్రంలోని ఇతర పట్టణాల అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని కోరారు. గతంలో అనేక సార్లు కేంద్రానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశామన్న కేటీఆర్.. మరోసారి కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నట్టు తెలిపారు. ప్రతిపాదనలు పంపిన ప్రతిసారి తెలంగాణకు నిరాశే ఎదురవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణాల అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుందనీ, తమ ప్రయత్నానికి తోడ్పాటనందించేందుకు వచ్చే బడ్జెట్లో సరిపడిన నిధులు కేటాయించాలని కోరారు. హైదరాబాద్, వరంగల్ లాంటి పట్టణాలకు ఒక ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని పేర్కొన్నారు. తెలంగాణపై వివక్షతోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అదనంగా ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని చెప్పారు. కేంద్రం మొండి చెయ్యి చూపినా.. అన్నీ రంగాల్లో రాష్ట్రం అద్భుతమైన ప్రగతి కనబరుస్తున్నదని తెలిపారు. ముందుచూపు, దూరదృష్టితో సీఎం కేసీఆర్ తెచ్చిన పరిపాలనా సంస్కరణలతోనే పట్టణాలన్నీ సమగ్ర అభివృద్ధి చెందాయని తెలిపారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డులు, రివార్డులే నిదర్శనమని గుర్తు చేశారు. ఇప్పటికైనా తమ ప్రభుత్వ పనితీరును మోడీ సర్కార్ గుర్తించి, నిధులు కేటాయిస్తారన్న నమ్మకంతో తాను ఈ లేఖ రాస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. 47శాతం రాష్ట్ర జనాభా పట్టణాల్లో నివసిస్తున్నందున అన్ని రంగాల్లో వాటిని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసమే నూతన మున్సిపల్ చట్టం, నూతన భవన నిర్మాణ అనుమతుల చట్టం, ప్రతి పట్టణం కచ్చితంగా ఖర్చు చేయాల్సిన 10శాతం గ్రీన్ బడ్జెట్, టీఎస్బీపాస్ వంటి విప్లవాత్మక కార్యక్రమాలను అమలుచేస్తున్నట్టు తెలిపారు.
మెట్రో ప్రాజెక్టుకు ఆర్థిక మద్దతు ఇవ్వాలి..
భవిష్యత్ అంచనాలు, అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలోని 68 పురపాలికలను 142కు పెంచుకున్నామని కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు. భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎయిర్ పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిందని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.6,250 కోట్ల బడ్జెట్తో 31 కి.మీమేర నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు సూత్రప్రాయ ఆమోదం తెలపాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆర్థికంగా మద్దతు ఇచ్చే విషయాన్ని కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో రూ.3,050 కోట్ల వ్యయంతో 20 కి.మీ. మేర మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ నిర్మాణం చేపడుతున్నామనీ, అందులో 15శాతం మూలధనం పెట్టుబడిగా రూ.450 కోట్లు కేటాయించాలన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ రూ.254 కోట్ల బకాయిలు ఐదేండ్లుగా పెండింగ్లో ఉన్నాయనీ, వాటిని విడుదల చేయాలని కోరారు. తెలంగాణలోని పురపాలికల్లో రూ.3,777 కోట్ల బడ్జెట్తో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, బయోమైనింగ్ ప్రాజెక్టుల నిమిత్తం 20శాతం అంటే రూ.750 కోట్లు కేంద్రం బడ్జెట్లో కేటాయించాలన్నారు. హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్యం మెరుగు కోసం రూ.400కోట్లు స్వచ్ఛ్ భారత్ మిషన్ నిధులు కేటాయించాలనీ, హైదరాబాద్ ప్రభుత్వం చేపట్టిన లింకు రోడ్ల నిర్మాణంతో మంచి ఫలితాలు, ప్రధాన రోడ్లపై భారీగా ట్రాఫిక్ తగ్గిందన్నారు. రూ.2400 కోట్లతో చేపట్టే 104 లింక్ రోడ్ల నిర్మాణ బడ్జెట్లో మూడోవంతు రూ.800 కోట్ల కేంద్ర ప్రభుత్వం భరించాలన్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందనీ, మూసీనది ఫ్రంట్ డెవలప్మెంట్, ఈస్ట్ వెస్ట్ఎక్స్ ప్రెస్వే కోసం రూ.11,500 కోట్లు, ఎస్ఆర్డీపీ రెండవ దశ రూ.14,000 కోట్లు, డెవలప్మెంట్ ఆఫ్ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, స్కైవేల నిర్మాణం కోసం రూ.9వేల కోట్లు మొత్తంగా అయ్యే రూ.34,500 కోట్లల్లో కనీసం పదిశాతం అంటే రూ.3,450 కోట్లు కేంద్రం ఈ బడ్జెట్లో కేటాయించాలని మంత్రి కోరారు. పట్టణాల అభివృద్ధికి ముఖ్యంగా హైదరాబాద్ మహానగర అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను శీఘ్రగతిన అమలు చేయడం కోసం పరిపాలనాపరమైన ఏర్పాట్లను చేసుకున్న విషయాన్ని కేటీఆర్ లేఖలో గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక అయిన హరితహారంతో హైదరాబాద్ నగరానికి వరల్డ్ గ్రీన్ సిటీగా అవార్డు లభించిందన్న కేటీఆర్.. మన దేశం నుంచి హైదరాబాద్ నగరానికి మాత్రమే ఆ గుర్తింపు దక్కిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తమ ప్రభుత్వ సంకల్పంతో హైదరాబాద్ అభివృద్ధి చెందడంతోపాటు అంతర్జాతీయ గుర్తింపు సైతం లభిస్తున్నదని వివరించారు. దేశ గౌరవ, ప్రతిష్ఠలను విశ్వవేదికలపై సగర్వంగా నిలబెడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ పట్టణాల అభివృద్ధికి కావాల్సిన వివిధ ప్రతిపాదనలు, విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచామనీ, కనీసం ఈ బడ్జెట్లోనైనా సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ కోరారు. కనీసం ఈ బడ్జెట్లోనైనా తెలంగాణ పట్టణాల అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.