Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయి పర్యటనలో పారిశ్రామికప్రముఖులతో మంత్రి కేటీఆర్ భేటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు శుక్రవారం ముంబయిలో పలువురు పారిశ్రామిక ప్రముఖులతో భేటీ అయ్యారు. టాటా గ్రూప్ చైర్మెన్ నటరాజన్ చంద్రశేఖరన్తో టాటా కార్పోరేట్ కేంద్ర కార్యాలయం బాంబే హౌస్లో సమావేశమై వివిధ వ్యాపార వాణిజ్య అవకాశాలపైన చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యుత్తమ పారిశ్రామిక విధానాలపై మాట్లాడిన మంత్రి కేటీఆర్, టాటా గ్రూపు కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఉన్న అవకాశాలను ఆయా రంగాల వారీగా వివరించారు. వ్యాపార అనుకూల పరిస్థితులు, అవకాశాలను దృష్టిలో ఉంచుకొని టాటా గ్రూపు వివిధ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. టాటా గ్రూపు వివిధ రంగాల్లో చేపట్టనున్న విస్తరణ ప్రణాళికలో రాష్ట్రానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా చంద్రశేఖరన్ను కేటీఆర్ కోరారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా టాటా గ్రూప్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని తెలిపిన కేటీఆర్, టీసీఎస్ కార్యకలాపాలను వరంగల్కు విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీ ప్రణాళికలతో టాటా గ్రూప్ ముందుకెళ్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్స్ పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని వివరించిన కేటీఆర్, ఈ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. విమానయాన రంగంలో టాటా సంస్థ మంచి పురోగతి సాగిస్తున్న నేపథ్యంలో... హైదరాబాదులో ఒక మెయింటనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేటీఆర్ కోరారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో తమ సంస్థ పెద్ద ఎత్తున కార్యకలాపాలను నిర్వహిస్తున్నదని తెలిపిన టాటా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, కార్యకలాపాలు కొనసాగుతున్న తీరుపట్ల అత్యంత సంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యాపార నిర్వహణ అత్యంత సులువుగా ఉంటుందని తమ సంస్థ అనుభవం నిరూపించిందన్న చంద్రశేఖరన్, భవిష్యత్తులో టాటా కార్యకలాపాల విస్తరణలో కచ్చితంగా తెలంగాణకు కీలకమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దేశ ఆర్థిక పురోగతి, అంతర్జాతీయ వ్యాపార వాణిజ్య పరిస్థితులు, వివిధ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాల వంటి అనేక ఇతర అంశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి.
జేయస్ డబ్ల్యు మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్తో ఆ సంస్థ కేంద్ర కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఆ సంస్థకు స్టీల్, సిమెంట్ వంటి రంగాల్లో ఉన్న అపార విజయవంతమైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కేటీఆర్ కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందనీ, అక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సేయిల్ సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. బయ్యారంతో పాటు పక్కనే ఉన్న చత్తీస్ ఘడ్లో ఉన్న ఇనుప ఖనిజం నిల్వలను దృష్టిలో ఉంచుకొని అక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని కేటీఆర్ వివరించారు. జేయస్ డబ్ల్యు వంటి ప్రతిష్టాత్మక సంస్థ బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొస్తే, అన్ని రకాల సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. జిందాల్ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విద్య, క్రీడారంగం వంటి ఇతర రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని జిందాల్ని కేటీఆర్ కోరారు. తెలంగాణ ప్రభుత్వం పాలసీల గురించి తమకు అవగాహన ఉన్నదన్న సజ్జన్ జిందాల్, కొన్నేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతి, పెట్టుబడుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు.
అనంతరం హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతాతో సమావేశమైన కేటీఆర్, తెలంగాణ రాష్ట్రంలో ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంతో పాటు అనేక ఇతర ఆర్థిక సూచీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయనీ, ఆయా రంగాల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిన నేపథ్యంలో తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకునేందుకు ఇదే సరైన అవకాశమని కేటీఆర్ తెలిపారు. ఈ రంగంలో ఇతర సంస్థలు పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. పామాయిల్ ఉత్పత్తి కోసం ఒక బృహత్తర లక్ష్యాన్ని ఎంచుకున్న తెలంగాణ ప్రభుత్వం, ఆ దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. వంట నూనెల ఉత్పత్తి కోసం హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని కేటీఆర్ సూచించారు.ఆర్పీజీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనంత్ గోయంకా తోనూ మంత్రి కేటీఆర్ సమావేశమై, పెట్టుబడులు, రాష్ట్ర ప్రగతిపై చర్చించారు.