Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాహితి ఉపాధ్యక్షులు తంగిరాల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అలిశెట్టి ప్రభాకర్ తెలుగు కవిత్వంలో పరిచయం అక్కరలేని కవి అనీ, ఆయన కవిత్వం యువతకు దిక్సూచి అని తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తి అన్నారు. గురువారం తెలంగాణ సాహితి హైదరాబాద్ నగర కమిటీ ఆధ్యర్యంలో నగర ఉపాధ్యక్షులు అనుమూల ప్రభాకరాచారి అధ్యక్షతన సభ నిర్వహించారు. అలిశెట్టి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తంగిరాల చక్రవర్తి మాట్లాడుతూ... కలంతో కవాతు చేసి.. రాశి కన్నా వాసి గొప్పదని నిరూపించిన సాహితీ సూరీడు అలిశెట్టి ప్రభాకర్ అని అన్నారు. తెలంగాణ సాహితి రాష్ట్ర సహాయకార్యదర్శి సలీమ మాట్లాడుతూ అక్షరాన్ని ఆయుధంగా మలిచి తన కవిత్వాన్ని ప్రాణవాయువుగా ప్రపంచంలో నింపేందుకు అలిశెట్టి తపించారని కొనియాడారు. అలాంటి వ్యక్తి సమగ్ర సాహిత్యాన్ని నవతెలంగాణ బుక్ హౌస్ ప్రచురించిందని గుర్తుచేశారు. అనంతరం నగర సహాయ కార్యదర్శి రామకృష్ణ చంద్రమౌళి నిర్వహణలో సంక్రాంతి కవిసమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర నాయకులు శరత్ సుదర్శి, ఎం.రేఖ, సయ్యద్ ముజాహిద్ అలీ, పేర్ల రాము, కవులు ఇందిరావెల్ది, రవీంద్ర, శివచరణ్, సుధా, కోదాటి అరుణ, రవీంద్ర, నాగేశ్వరరావు, దేవాదీనం తదితరులు పాల్గొన్నారు.