Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు సీఎస్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పిలుపునిచ్చారు. కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణపై శుక్రవారం జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎస్ మాట్లాడుతూ, ఈ నెల 18న రాష్ట్ర ముఖ్యమంత్రి కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు.
2018లో నిర్వహించిన తొలి విడత కంటి వెలుగు కన్నా ఎక్కువ మందికి కంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా మన రికార్డు మనమే బద్దలుకొట్టి సరికొత్త రికార్డు సృష్టించాలని కలెక్టర్లను కోరారు. ఇప్పటికే 15 లక్షలకు పైగా కండ్లద్దాలను రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలకు, అర్బన్ వైద్య కేంద్రాలకు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకుగాను రాష్ట్రవ్యాప్తంగా 1,500 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. కంటి వెలుగు కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరికీ తెలిసేలా విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్ లో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వి, ఫ్యామిలీ వెల్ఫేర్ కమీషనర్ శ్వేతా మహంతి, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ డా. సత్యనారాయణ పాల్గొన్నారు.