Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలుకు సీఎం సంక్రాంతి శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక ప్రగతి అందించే స్ఫూర్తితో, యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగైన నాడే.. భారత దేశానికి సంపూర్ణ క్రాంతి చేకూరుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంట పొలాల నుంచి ధాన్యపు రాశులు ఇండ్లకు చేరుకున్న శుభ సందర్భంలో రైతన్న జరుపుకునే సంబురమే సంక్రాంతి పండుగనీ, నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునే రోజే సంక్రాంతి పండుగ అని సీఎం అభివర్ణించారు.రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని పునర్జీవింప చేసేందుకు చేపట్టిన కార్యాచరణతో తెలంగాణ పల్లెలు పచ్చని పంట పొలాలు, ధాన్యరాశులు, పాడి పశువులు, కమ్మని మట్టివాసనలతో సంక్రాంతి శోభను సంతరించుకుని వైభవోపేతంగా వెలుగొందుతున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యవసాయరంగం సాధించిన ప్రగతి నేడు యావత్ దేశానికి మార్గదర్శనంగా నిలిచిందని సీఎం తెలిపారు. రాష్ట్ర వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసే దిశగా లక్షలాది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రాష్ట్రం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటివరకు రూ.2,16,000 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసిందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం పట్ల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి 1 కోటి 31 లక్షల ఎకరాలు మాత్రమే వున్న సాగు విస్తీర్ణం ప్రస్తుతం 2 కోట్ల 4 లక్షల ఎకరాలకు పెరిగిందని గుర్తుచేశారు. ఇది దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక పరిణామని సీఎం తెలిపారు. ఒకనాడు దండుగ అన్న వ్యవసాయం తెలంగాణలో నేడు పండుగ అయిందని, వ్యవసాయరంగాన్ని నమ్ముకుంటే జీవితానికి ఢోకా లేదనే విశ్వాసం తెలంగాణ రైతుల జీవితాల్లో తొణికిసలాడుతున్నదనీ, ఇదే విశ్వాసాన్ని దేశ రైతాంగంలో పాదు కొల్పుతామని సీఎం స్పష్టం చేశారు. ఈ దిశగా యావత్ భారత ప్రజల సహకారంతో, సమిష్టి కృషితో దేశ వ్యవసాయ రంగ నమూనాను సమూలంగా మార్చి గుణాత్మక అభివృద్థికి బాటలు వేయాల్సిన అవసరం వుందని పిలుపునిచ్చారు. ప్రజలంతా మకర సంక్రాంతి పండుగను సుఖసంతోషాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలనీ, ప్రతీ ఇల్లు సిరి సంపదలతో తులతూగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.