Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.2,000 కోట్లతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ల ఏర్పాటు
- భారతి ఏయిర్ టెల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డేటా స్టోరేజ్, విశ్లేషణలో అత్యాధునిక సాంకేతికత అయిన హైపర్ స్కేల్ డేటా సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటు కానుంది. తన అనుబంధ సంస్థ అయిన నెక్స్ ట్రా ద్వారా భారతీ ఎయిర్టెల్ ఈ డేటా సెంటర్ను నెలకొల్పుతుంది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయల కల్పన కోసం రూ.2,000 కోట్లు పెట్టుబడిగా పెడుతామని ఏయిర్ టెల్ ప్రకటించింది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావుతో భారతి ఏయిర్ టెల్ వ్యవస్థాపకులు, చైర్మెన్ సునీల్ భారతి మిట్టల్, వైస్ చైర్మెన్, ఎండీ రాజన్ భారతీ మిట్టల్ సమావేశం తరువాత ఆ సంస్థ ఈ ప్రకటన చేసింది. 60 మెగావాట్ల సామర్థ్యంతో ఈ హైపర్ స్కేల్ డేటా సెంటర్ రాబోతుంది. డేటా భద్రతలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ఈ డేటా సెంటర్ రాబోయే ఐదు నుంచి ఏడు సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో తన కార్యకలాపాలు కొనసాగించనున్నది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ''ఏయిర్టెల్-నెక్స్ట్రా తెలంగాణలో పెట్టుబడి పెట్టడం చాలా అనందంగా ఉంది. భారతదేశంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్లకు హైదరాబాద్ హబ్గా మారిందనీ, ఎయిర్టెల్ తాజా పెట్టుబడితో తాము ఆశిస్తున్న మరిన్ని ఫలితాలు వస్తాయని నమ్ముతున్నాను. ఏయిర్ టెల్, తెలంగాణ మధ్య ఈ సంబంధం ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నాను. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఏయిర్ టెల్- నెక్సాట్రాతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది....''అని తెలిపారు.సునీల్ భారతి మిట్టల్ మాట్లాడుతూ:- ''హైదరాబాద్లో ఏర్పాటు చేయబోయే హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ డేటా సెంటర్ ప్రాజెక్ట్లలో ఒకటి. తెలంగాణతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. 2022 మేలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల్లో ప్రారంభమైన డేటా సెంటర్ ఏర్పాటు చర్చలు నెలల వ్యవధిలోనే కార్యరూపం దాల్చడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా వేగంగా పని చేసింది. ఇతర రంగాల్లోనూ మా ఉనికి, ముద్రను చాటుకోవడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం......'' అని ప్రకటించారు. ఈ సమావేశంలో ఐటీ,పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.