Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆహారం, పర్యావరణం, ఫార్మా స్యూటికల్, కాస్మెటిక్ ఉత్పత్తుల పరీక్షలో, బయో అనలిటికల్ టెస్టింగ్లో ఫ్రాన్స్కు చెందిన యూరోఫిన్స్ సంస్థ హైదరాబాద్ లో అత్యాధునిక క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆహారం, పర్యావరణం, ఔషధాలు, కాస్మెటిక్ ఉత్పత్తుల పరీక్షలో యూరోఫిన్స్ గ్లోబల్ లీడర్గా పేరుగాంచింది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావుతో సమావేశమైన యూరోఫిన్స్ ప్రతినిధి బృందం తమ విస్తరణ ప్రణాళికలను చర్చించింది. 90,000 అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ అత్యాధునిక ప్రయోగశాలలో సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎనలిటికల్ ఆర్ అండ్ డీ, బయో అనలిటికల్ సర్వీసెస్, ఇన్-వివో ఫార్మాకాలజీ, సేఫ్టీ టాక్సికాలజీ రంగాలకు చెందిన అంతర్జాతీయ స్థాయి దేశ,విదేశ ఫార్మాస్యూటికల్ కంపెనీలతో పాటు చిన్న బయోటెక్ కంపెనీలకు అవసరమైన సేవలు అందనున్నాయి. తన అనుబంధ సంస్థ యూరోఫిన్స్ అడ్వినస్ ద్వారా హైదరాబాద్లో ప్రయోగశాలను యూరోఫిన్స్ ఏర్పాటు చేస్తున్నది. ప్రస్తుతం మన దేశంలో యూరోఫిన్స్ కొనసాగిస్తున్న కార్యకలాపాలతో పాటు డిస్కవరీ కెమిస్ట్రీ, ఎనలిటికల్ కెమిస్ట్రీ, బయో అనలిటికల్ సర్వీస్లను ఈ ల్యాబ్ ద్వారా మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఫార్ములేషన్ డెవలప్మెంట్తో పాటు ఇన్-విట్రో,ఇన్-వివో బయాలజీ విభాగాల్లో తన సేవలను విస్తరించేందుకు 2023వ సంవత్సరం ప్రారంభం నుంచే యూరోఫిన్స్ అడ్వినస్కు ఈ ల్యాబ్తో అవకాశం కలుగు తుంది. ఔషధాల పరిశోధన, తయారీలో ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ స్థానాన్ని యూరోఫిన్స్ అడ్వినస్ తాజా పెట్టుబడి మరింత బలోపేతం చేసింది. యూరోఫిన్స్ సీఈఓ డాక్టర్ గిల్లెస్ మార్టిన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించడంతో పాటు లేబోరేటరీ నెట్వర్క్ను మరింత సుస్థిరం చేసుకునే దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికలు తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. కేటీఆర్ మాట్లాడుతూ జీనోమ్ వ్యాలీలో యూరోఫిన్స్ ప్రవేశిస్తున్నం దుకు హర్షం వ్యక్తం చేశారు. తాజా పెట్టుబడితో జీనోమ్ వ్యాలీలోని గ్లోబల్ కంపెనీల జాబితాలో చేరిన యూరోఫిన్స్కు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్తో పాటు తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం.నాగప్పన్ పాల్గొన్నారు.