Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో విడత కంటి వెలుగు ప్రారంభం
- ప్రారంభించిన సీఎంలు, జాతీయ నేతలు
- లబ్దిదారులకు కండ్లద్దాలు పెట్టిన నేతలు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమ ప్రారంభం నేత్రపర్వంగా సాగింది. తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్మాన్తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా బుధవారం ఖమ్మంలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచే కంటి వెలుగుకూ శ్రీకారం చుట్టారు. ధరవాత్ బిచ్చమ్మకు కేరళ సీఎం విజయన్ కండ్లద్దాలు పెట్టారు. మందా అన్నపూర్ణ, రామనాథం, కోలం జ్యోతి, వెంకటేశ్వర్లు, షేక్ గౌసియా బేగంకు ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్మాన్, కేసీఆర్, నేతలు అఖిలేశ్ యాదవ్, డి.రాజా కంటి అద్దాలను అందజేశారు. కంటి వెలుగు కార్యక్రమం గురించి జాతీయ నేతలకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు. రాష్ట్రంలో అంధత్వాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించడంతో పాటు నేత్ర కాంతులు నింపాలనే లక్ష్యంతో ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. లక్షలాది మందికి కంటి పరీక్షలు నిర్వహించి అక్కడికక్కడే మందులు, కండ్లద్దాలు అందజేస్తున్నట్టు చెప్పారు. సమస్య తీవ్రత ఆధారంగా ఆపరేషన్ల నిమిత్తం మరికొందరిని ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రులకు పంపిస్తున్నారన్నారు. రెండో విడత కార్యక్రమం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ యంత్రాంగం కొత్త కలెక్టరేట్లో ఏర్పాట్లు చేసింది. క్షేత్రస్థాయిలో కార్యక్రమ వివరాలు తెలిసేలా శిబిరాలను సిద్ధం చేశారు. రిజిస్ట్రేషన్, ఆన్లైన్, కంటి పరీక్షలు, మందులు, కండ్లద్దాల పంపిణీకి సంబంధించిన టేబుల్స్, స్టాల్స్ నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీజీపీ అంజనీకుమార్, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రిజ్వీ, కమిషనర్ శ్వేతా మహంతి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.