Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు లేదా సోమవారం షెడ్యూల్ జారీ
- 37 రోజులపాటు వెబ్కౌన్సెలింగ్ నిర్వహణ
- విధివిధానాల రూపకల్పనపై విద్యాశాఖ కసరత్తు
- పారదర్శకంగా నిర్వహించాలి : అధికారులకు మంత్రి సబిత ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఈనెల 27 నుంచి ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాలతో అందుకు సంబంధించి శుక్రవారం హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఉన్న మంత్రి చాంబర్లో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన, అదనపు సంచాలకులు లింగయ్యతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 27 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని కోరారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలని సూచించారు. అయితే బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ శనివారం లేదా సోమవారం విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. 37 రోజులపాటు బదిలీల వెబ్కౌన్సెలింగ్ను నిర్వహించే అవకాశమున్నది. బదిలీలు, పదోన్నతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. అయితే బదిలీలు వెబ్కౌన్సెలింగ్ ద్వారా, పదోన్నతులు ఆఫ్లైన్లో చేపడతారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు కసరత్తును వేగవంతం చేశారు.
హెచ్ఎంల బదిలీ గరిష్ట కాలపరిమితి 8 ఏండ్లకు పెంపు!
రాష్ట్రంలోని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల (హెచ్ఎం)కు తొలుత బదిలీల ప్రక్రియను నిర్వహిస్తారు. అయితే 2015, 2018లో నిర్వహించిన బదిలీల మార్గదర్శకాల్లో హెచ్ఎంల బదిలీల గరిష్ట కాలపరిమితి ఐదేండ్లు ఉన్నది. అంటే పాఠశాలలో ఐదేండ్ల సర్వీసు ఉన్న ప్రతి హెచ్ఎం తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. తాజా మార్గదర్శకాల్లో ఆ పరిమితిని ఎనిమిదేండ్లకు ప్రభుత్వం పెంచినట్టు విశ్వసనీయంగా తెలిసింది. హెచ్ఎంల బదిలీ గరిష్ట కాలపరిమితి ఐదేండ్ల నుంచి ఎనిమిదేండ్లకు పెంచాలన్న ఆలోచన సరైంది కాదని టీఎస్యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి, టీఎస్జీహెచ్ఎంఏ అధ్యక్షులు పి రాజభాను చంద్రప్రకాశ్ నవతెలంగాణతో చెప్పారు. ఈ నిర్ణయం వల్ల హెచ్ఎంలు నష్టపోతారని అన్నారు. ఐదేండ్ల సర్వీసు నిండిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి విద్యామంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, కార్యదర్శి వాకాటి కరుణను రాజభాను చంద్రప్రకాశ్ కలిసి వినతిపత్రం సమర్పించారు. హెచ్ఎంల బదిలీల తర్వాత ఆయా ఖాళీల్లో స్కూల్ అసిస్టెంట్ల (ఎస్ఏ)కు పదోన్నతులు కల్పిస్తారు. అనంతరం ఎస్ఏల బదిలీలు చేపడతారు. ఆ తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)కు పదోన్నతులు కల్పించి స్కూల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీ చేస్తారు. అనంతరం ఎస్ఏ, ఎస్జీటీల ఖాళీల వివరాలను మరోసారి విద్యాశాఖ అధికారులు సేకరిస్తారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసే అవకాశమున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో 2015 జులైలో బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. 2018లో బదిలీలు నిర్వహించారు.
ఉద్యోగ విరమణకు మూడేండ్ల ముందు బదిలీలుండవు
ఉద్యోగ విరమణకు ఇంకా మూడేళ్ల సర్వీస్ మాత్రమే ఉన్నవారిని బదిలీ చేయొద్దని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఇంతకుముందు రెండేళ్ల సర్వీస్ మాత్రమే మిగిలి ఉన్నవారికి బదిలీ నుంచి మినహాయింపు ఉండేది. ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 61 ఏండ్లకు పెంచినందున ఈ ఏడాది మూడేండ్ల సర్వీస్ మిగిలి ఉన్నా బదిలీ చేయొద్దని ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు కనీసం రెండేండ్ల సర్వీసు ఉండాలన్న నిబంధన 2015, 2018లో ఉన్నది. అయితే జీరో సర్వీసుతో ఉపాధ్యాయులందరికీ బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. మార్గదర్శకాల్లో రెండేండ్ల సర్వీసుతో ఉన్న వారికే అవకాశం కల్పిస్తారా? లేదా జీరో సర్వీసుతో ఉన్న వారిని పరిగణనలోకి తీసుకుంటారా? అన్నది వేచిచూడాల్సిందే.