Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణా కార్యక్రమాలు బాగున్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి తెలిపింది. శుక్రవారం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై పార్లమెంటరీ స్ధాయి స్టాండింగ్ కమిటీ అధ్యయనం నిమిత్తం హైదరాబాద్ పర్యటనకు వచ్చింది. పార్లమెంటరీ కమిటీ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్రంలో అమలవుతుస్తున్న ఆరోగ్య సంరక్షణ, నిర్వహణ చర్యలు, ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అమలు కార్యక్రమాలపై సమీక్షించారు. భువనేశ్వర్ కలితా నేతృత్వంలోని కమిటీ ఆరోగ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రభుత్వ నిర్వహణా కార్యక్రమాల గురించి వివరించారు. ప్రతి జిల్లాలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయటం ద్వారా రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తున్నదని వివరించారు. వైద్య కళాశాలల నిమిత్తం ప్రభుత్వం భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ను చేపట్టినట్టు కమిటీకి తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం ద్వారా గర్భిణులకు ఆర్థిక సాయం, ఇతర ఆరోగ్య సంబంధిత పథకాల వివరాలను కమిటీకి తెలియజేశారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ''అంధత్వ రహిత తెలంగాణ'' కోసం ప్రభుత్వ లక్ష్యంగా కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల అమలుతీరుపై పార్లమెంటరీ కమిటీ సభ్యులు ప్రశంసించారు . ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.