Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటికే అనేక సార్లు లేఖలు రాసినా స్పందన లేదు : కేంద్రానికి మంత్రి హరీశ్ మరో లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఏపీకి బదలాయించిన సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ (సీఎస్ఎస్) నిధులు రూ 495 కోట్లు ఇప్పించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కేంద్రాన్ని కోరారు. వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్కు మరోసారి లేఖ రాశారు. 2014-15లో సీఎస్ఎస్ ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు రూ.495 కోట్లు పొరబాటున ఏపీ ప్రభుత్వ ఖాతాలో జమ చేశారనీ, వాటిని తిరిగి ఇప్పించాలని కోరారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి సంవత్సరంలో (2014-15) కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జనాభా ప్రాతిపదికన విభజించారనీ, అయినా పొరపాటున మొత్తం సీఎస్ఎస్ నిధులను ఆంధ్రప్రదేశ్కు విడుదల చేశారని గుర్తు చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రం నష్ట పోయిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు అకౌంటెంట్ జనరల్కు సైతం వివరించిందని పేర్కొన్నారు. ఎనిమిదేండ్లు గడుస్తున్నా... రూ. 495 కోట్లను తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదని వివరించారు. ఈ విషయాన్ని అనేక సార్లు కేంద్రానికి ఉత్తరాలు రాశామని తెలిపారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్కు పొరబాటున విడుదల చేసిన రూ. 495 కోట్ల మొత్తాన్ని తిరిగి తెలంగాణకు విడుదల చేసేలా కృషి చేయాలని మంత్రి కోరారు.