Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి విచారణపై ఉత్కంఠ
నవతెలంగాణబ్యూరో - హైదరాబాద్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆదివారం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆమెతో పాటు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. ఢిల్లీ మద్యం కేసులో సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం ఆమె విచారణకు హాజరవుతారా? లేక గతంలో మాదిరిగా తన న్యాయవాదిని పంపిస్తారా? అనేది చర్చనీయాం శంగా మారింది. విచారణకు హాజరుకావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేయడంపై కవిత ఇదివరకే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ నిమిత్తం మహిళనైన తనకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారనీ, కానీ వాస్తవంలో అలా చేయలేదని కవిత పేర్కొన్నారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, తక్షణమే విచారించేందుకు నిరాకరించింది. ఈనెల 24న వాదనలు వింటామంటూ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండటంతో ఈ నెల 16న ఈడీ విచారణకు కవిత హాజరు కాలేదు. దీంతో సుప్రీం తీర్పునకు ముందే మరోసారి వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది.