Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ప్రగతికి అడుగడుగునా అడ్డంకులు
- పనికిమాలిన పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
- మరోసారి బ్రహ్మాండమైన విజయం తథ్యం
- కార్యకర్తలే నాబలం..బలగం...
- ఇది ఎన్నికల సంవత్సరం.. ప్రజల్లోనే ఉండండి... : బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ సందేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ బరితెగింపు దాడులకు పాల్పడుతూ తెలంగాణ ప్రగతికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నదని బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల మతాల కుమ్ములాటల వల్ల అన్ని వనరులూ వసతులూ ఉండి కూడా భారతదేశం భంగపడుతున్నదని చెప్పారు. ఒక్క తెలంగాణ రాష్ట్రం బాగుంటే సరిపోదనీ, దేశం కూడా బాగుండాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్కు శ్రీకారం చుట్టినట్టు పేర్కొన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయనీ..మరోసారి తమ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధించడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలే తన బలం,బలగమంటూ పేర్కొన్న సీఎం... పనికిమాలిన పార్టీల దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొడుతూ ఎన్నికల వేళ నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం కేసీఆర్ రెండు పేజీల ఆత్మీయ సందేశాన్ని బీఆర్ఎస్ శ్రేణులకు విడుదల చేశారు. 'అన్నం తినో, అటుకులు తినో.. ఉపాసం ఉండో 14 ఏండ్లు పేగులు తెగేదాకా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నం. అధికారం లేకున్నా ఉద్యమ కాలంలో జెండా భుజాన వేసుకుని.. లాఠీలకు, జైళ్లకు వెరవకుండా రేయింబవళ్లు శ్రమించి పార్టీని కాపాడుకున్న ఘనత కీర్తి గులాబీ సైనికులకే దక్కుతుంది. ప్రజల ఆశీర్వాదం, నిబద్ధత కలిగిన లక్షలాది కార్యకర్తల అసమాన కృషితో అపురూప విజయాలు సాధించి రెండుసార్లు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టింది. ఉద్యమ వీరులుగా ఆనాడు.. నవ తెలంగాణ నిర్మాణయోధులుగా ఈనాడు పట్టుదల.. అంకితభావంతో పనిచేస్తూ అపూర్వ విజయాలు సాధించిపెట్టింది మీరే..! మీరిచ్చిన బలంతోనే 60 లక్షల సభ్యత్వంతో అజేయమైన శక్తిగా పార్టీ ఎదిగింది. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఎవ్వరికీ సాధ్యంకాని.. ఏకపక్ష విజయాలను సాధిస్తూ బీఆర్ఎస్ రికార్డులను తిరగరాసింది' అని కేసీఆర్్ తన సందేశంలో పేర్కొన్నారు.
'21 ఏండ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ఆటుపోట్లను తట్టుకొని మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూ గమ్యాలను ముద్దాడిన గట్టిసిపాయి మన పార్టీ. కష్టసుఖాలల్లో కలిసినడుస్తూ, ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ తరహాలో పల్లెల్లో, గల్లీల్లో గులాబీ పతాకాన్ని రెపరెపలాడించి నాకు కొండంత అండగా నిలిచిన మీ రుణాన్ని ఎన్నడూ తీర్చుకోలేను. ఇతరులకు పాలిటిక్స్ అంటే గేమ్.. బీఆర్ఎస్కు మాత్రం టాస్క్. రాజకీయాన్ని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పవిత్ర కర్తవ్యంగా భావించి కొత్తపంథాలో నడుస్తూ కోటి ఆశలతో ఏర్పడ్డ తెలంగాణను కోటి కాంతులు విరజిమ్మే నేలగా తీర్చిదిద్దుకున్నం. కష్టాలు, కన్నీళ్లు, కరువులతో అల్లాడిన తెలంగాణ... ఈరోజు పచ్చని పంటలతో, చిరునవ్వులతో కళకళలాడుతున్నది. ఆగమైపోయిన తెలంగాణ నేడు కుదుటపడ్డది. కడుపునిండా తిని, కంటినిండా నిద్రపోతున్నది. ఒక్కో పథకం ఒక్కో ఆణిముత్యమై దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. కలలో కూడా ఊహించని కార్యాలను చేపట్టి.. అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేసి చూపించి, తెలంగాణను దేశానికి నమూనాగా నిలబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అడిగినవి, అడగనవీ.. చెప్పినవీ, చెప్పనవి ఎన్నో పనులు చేస్తూ అందరి బంధువుగా నిలిచాం. ఏ వర్గాన్నీ చిన్నబుచ్చలేదు. ఏ ఒక్కరినీ విస్మరించలేదు. మనకు కులం లేదు. మతం లేదు. తెలంగాణ సమాజానికి పొత్తుల సద్దిమూట బీఆర్ఎస్. సంపదను పెంచుతూ ప్రజలకు పంచుతూ భారతదేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించి ఉజ్వలంగా వెలుగొందు తున్నది తెలంగాణ.
మనం ఇట్లావుంటే దేశం కథ ఇంకో లెక్కన ఉంది.75 ఏండ్ల స్వతంత్రం తర్వాత కూడా కోట్లాది మందికి తాగడానికి నీళ్లులేవు. తినడానికి తిండిలేదు. నదుల నిండా నీళ్లున్నా.. పొలాలకు సాగునీరు రాలేదు. కరెంట్ కష్టాలు తీరలేదు. అందుకే దేశానికి కొత్త ఎజెండాను నిర్దేశించి, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు భారత రాష్ట్ర సమితిగా మరో ప్రస్థానాన్ని మొదలుపెట్టినం. ఏదైనా పని మొదలు పెడితే.. కడదాకా కాడిదించే అలవాటేలేని ఉక్కు సంకల్పం మనది.'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదం ఎత్తుకుని, దేశం కోసం బయల్దేరినం. ప్రజలే కేంద్ర బిందువుగా.. వారి సమస్యలే ఇతివత్తంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ను తెలంగాణ సమాజం ఎన్నడూ వదులుకోదు. చిల్లర మల్లర రాజకీయ శక్తులను ఎప్పుడూ ఆదరించదు. తెలంగాణతో బీఆర్ఎస్ పార్టీది పేగుబంధం. పురిటిగడ్డపైన గులాబీ పార్టీ మరోసారి బ్రహ్మాండమైన విజయం సాధించడం తథ్యం. ఇది ఎన్నికల సంవత్సరం. భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేసే బాధ్యత కార్యకర్తల భుజ స్కంధాలపైనే వుంది. ధర్మమే జయిస్తుంది' అని కేసీఆర్ పేర్కొన్నారు.