Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎకరాకు రు.20వేలు ఇవ్వాలి : తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రు.20వేల నష్టపరిహారమిచ్చి ఆదుకో వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత నాలుగు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రంలో ఐదు లక్షల ఎకరాల్లో ధాన్యం, మామిడి, మొక్కజొన్న, జొన్న, పసుపు, పొద్దుతిరుగుడు, కూరగాయలు తదితర పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. పిడుగులు పడటంతో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగిందని తెలిపారు. గొర్రెలు, మేకలు,కోళ్లు చనిపోయాయని చెప్పారు. తక్షణమే నష్టాల గణాంకాల పూర్తి వివరాలను సేకరించి, రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. 'రాష్ట్రంలో 2018 నుంచి నేటి వరకు రూ.1,500 కోట్ల పంటల నష్టం వాటిల్లింది. 2020 నుంచి 2023 వరకు రు.1,787 కోట్లు 15వ ఫైనాన్స్ కమిషన్లో ప్రకటించినా నేటికీ నష్టపరిహారం అందింది నామమాత్రమే. 2022 వానాకాలంలో అధిక వర్షాల వల్ల 11 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆరుగురు మరణించారు. ఈ ఏడాదిలోనే రు.3,500 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దానికి తోడు ప్రస్తుత వానలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
జరిగిన నష్టంపై వెంటనే కేంద్రానికి లేఖ రాసి పరిశీలనకు ప్రత్యేక టీమ్ను పంపించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరాలి. నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రు.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలి. ఇళ్లు దెబ్బతిన్న వారికి, జీవాలు, ఇతరత్రా నష్టం జరిగిన వారికి ఆర్ధిక సహాయం అందించాలి. ప్రాణాలు కోల్పోయినవారికి ఎక్స్గ్రేషియో చెల్లించి వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలి. ప్రకృతి వైపరీత్యాల కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.3 వేల కోట్లు కేటాయించాలని' ఈ సందర్భంగా తమ్మినేని డిమాండ్ చేశారు.