Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మే 12 నుంచి 14 వరకు ఇంజినీరింగ్ విభాగం
- పాత తేదీల్లోనే అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం
- ఉన్నత విద్యామండలి వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ రాతపరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మే ఏడు నుంచి 11వ తేదీ వరకు జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం రాతపరీక్షల తేదీలు మారాయి. మే 12,13,14 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగం రాతపరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మే ఏడో తేదీన నీట్ (యూజీ) పరీక్ష ఉంటుందంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించిందనీ, మే ఏడు, ఎనిమిది, తొమ్మిది తేదీల్లో టీఎస్పీఎస్సీ పరీక్షలను నిర్వహిస్తుండడంతో ఈ మార్పులు చేశామని వివరించారు. వాటిని దృష్టిలో ఉంచుకుని ఎంసెట్కు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఇంజినీరింగ్ విభాగం షెడ్యూల్ను సవరించామని తెలిపారు. అయితే ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం రాతపరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పు చేయలేదనీ, మే 10,11న పాత తేదీల్లోనే యథాతథంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంసెట్ దరఖాస్తుల గడువు ఈనెల పదో తేదీ వరకు ఉన్నది. ఆలస్య రుసుముతో వచ్చేనెల రెండో తేదీ వరకు అవకాశమున్నది. ఈనెల 30వ తేదీ నుంచి ఎంసెట్కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఎంసెట్కు 1.92 లక్షల దరఖాస్తులు
శుక్రవారం నాటికి 1,80,240 దరఖాస్తులొచ్చాయని ఎంసెట్ కన్వీనర్ డీన్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగానికి 1,23,129 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 69,233 మంది, ఆ రెండింటికీ 223 మంది దరఖాస్తు చేశారని వివరించారు. ఆలస్య రుసుం లేకుండా వాటి సమర్పణకు తుది గడువు ఏప్రిల్ పదో తేదీ వరకు ఉన్నది.