Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తూకంలో మోసాలు, ఎడాపెడా దోపిడీ
- కల్తీ పెట్రోల్ విక్రయాలు
- రెచ్చిపోతున్న వ్యాపారులు...
- కరువైన తూ.కొ పర్యవేక్షణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తూకంలో మోసాలు, కల్తీ వ్యాపారాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. మోసాలను నియంత్రించాల్సిన తూనికలు, కొలతల శాఖ అధికారులు నిర్లక్ష్యం.. వ్యాపారులకు కలిసివస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నంలో.. పప్పులో.. ఉప్పులో.. నీళ్లలో.. పాలలో ఇలా అన్నింట్లో కల్తీనే. టి పొడిలో రంపంపొట్టు, మిర్యాలలో పొప్పడికాయ గింజలు, కందిపప్పులో కేసరి పప్పు, కాఫీ పొడిలో చింతగింజల పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్లో ఆలుగడ్డ పేస్ట్, పెసరపప్పులో మోట్పప్పు, కందిపప్పులో బట్రిపప్పు, గసగసాల్లో రాజ్గిరా, మిరియాల్లో బొప్పాయి విత్తనాలు, శనగపిండిలో బటానీ పప్పు, పల్లినూనెలో కాటన్సీడ్ ఆయిల్.. పసుపులో రంపపొడి, పెరుగు గట్టి పడేందుకు వరి పిండి కలపడం నుండి తాగే మంచినీటి వరకు సర్వం కల్తీమయంగా మారింది. పాలలో నీళ్లు, యూరియా, గంజిపోడి, సోడియం బై కార్పోనేట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, అమ్మోనియం సల్ఫేట్ తదితర రసాయనాలు కలపి ప్రజల ప్రాణాలను హరించేస్తున్నారు. వీటికితోడు నకిలీ వస్తువుల ఉత్పత్తీ గణీనీయంగా పెరిగిపోయింది. ప్రస్తుత బహిరంగా మార్కెట్లో 70 శాతం మేర కల్తీ జరుగుతోందని వ్యాపార వర్గాలే ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. స్వచ్ఛత లేని కల్తీ ఆహార పదార్థాలు తినడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. కల్తీ వ్యాపారంలో ఆరితేరిన కొందరు అక్రమార్కులు వినియోగదారులు గుర్తించలేని విధంగా అన్నింటినీ కల్తీ చేసేస్తున్నారు. దీంతో 'కల్తీ' పై అవగాహన లేని సామాన్యులు నాణ్యతలేని సరుకులు తిని ఆస్పత్రుల పాలవుతున్నారు.
అంతా 'మామూలే' : తూకంలో జరిగినన్ని మోసాలు మరెందులోనూ జరగవంటే అతిశయోక్తి కాదు. పాల నుంచి పప్పు వరకు, కిరోసిన్ నుంచి కూరగాయల వరకు అన్నీ తప్పుడు తూకాలే. చిల్లర కొట్టు బండి నుంచి బడా మాల్స్ వరకు ఇదే పరిస్థితి. ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లో చేతివాటం, బంగారం తూచే మిషన్లు ఇలా అన్నింట్లోనూ మోసాలే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేద ప్రజలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న సబ్సిడీ సరుకులూ రాష్ట్రంలో పక్కదారి పడుతున్నాయి. పేదల రేషన్ బియ్యం, కిరోసిన్, ఇతరత్రా వస్తువులు నల్లబజారుకు తరలుతున్నాయి. ప్రజలకు అందాల్సిన వివిధ వస్తు వులపై నెలసరి సబ్సిడీ విలువ రూ.200 కోట్లపైనే ఉంటుంది. కానీ అందులో సగానికి పైగా పేదలకు అందని ద్రాక్షగా మారి పక్కదారి పట్టడం సర్వసా ధారణంగా మారింది. మరోవైపు గృహ వినియోగ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్లు సైతం వాణిజ్య అవసరాల కోసం పక్కదారి పడుతున్నాయి. వీటిని పర్యవేక్షించి అరికట్టేందుకు ప్రత్యేక శాఖలున్నా అంతా 'మాములే'. ఇక సగటు జీవి షాపిం గ్మాల్.. హోటల్.. ఆస్పత్రి.. ఎక్కడికి వెళ్లినా నిలువుదోపీడీయే. ఇష్టానుసారం ధరలు, బిల్లింగ్, అర్ధం కాని అంకెలు. వ్యాపారులు వేసే ధరలు.. వాటిపై పన్నుల మోత.. ఇచ్చే రసీదులు కళ్లు బైర్లు కమ్మిస్తాయి. దీనిపై నియంత్రణ లేదా? ఈ మోసాలు ఎన్నాళ్లు భరించాలని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ఇక కూరగాయలు, కిరాణషాపులు, మటన్, చికెన్, చేపల మార్కెట్లతో తనిఖీలు పడకేశాయి. కూరగాయాల్లో వ్యాపారస్తులు తక్కువ తూకం వేయడంతో పాటు రెండు రకాల బాట్లను ఉపయోగిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. కొన్ని కిరాణ షాపుల్లో రెండు రకాల నిత్యావసర వస్తువులు విక్రయిస్తుంటారు. నెంబర్ వన్, నెంబర్ టూ పేరుతో అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక మటన్, చికెన్ ధరలు షాపుకో రకంగా విక్రయిస్తుండటంతో వినియోగదారులు మోసపోక తప్పడం లేదు. ఇటీవల గాంధీ జయంతి రోజున మాంసం అమ్మకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.
పెట్రోల్లో నీళ్లు: రాష్ట్రంలోనే సగానికి పైగా పెట్రోల్ అమ్మకాల్లో వాట గల హైదరాబాద్లో కొత్త తరహా మోసాలు వివిధ సందర్భాల్లో బయటపడతూనే ఉన్నాయి. ఇటీవల ఎల్బీ నగర్లోని ఓ పెట్రోల్ బంక్లో ఏకంగా పెట్రోల్లో నీళ్లు కలిపి విక్రయించారు. ఈ విషయమై వినియోగదారుడు నిలదీయడంతో యజమాని తప్పుని ఒప్పుకున్నాడు. అనంతరం అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న దాఖలాలు లేవని సమాచారం. ఇప్పటికైనా తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు ముమ్మరం చేసి మోసాలను అరికట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.