Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి
- ఎంపికపై అభిప్రాయ సేకరణ
- వివేక్ వైపు కార్యకర్తల మొగ్గు !
నవతెలంగాణ-వరంగల్ ప్రతినిధి
వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. అభ్యర్థి ఎంపికపై మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నాయకుల వరకూ అభిప్రాయాలను ఎస్సీసెల్ జాతీయ కార్యదర్శి కొప్పుల రాజు సమక్షంలో తీసుకున్నామన్నారు. హన్మకొండలోని కాంగ్రెస్ భవన్లో సోమవారం నియోజకవర్గాల వారీగా సమావేశం జరిగింది. ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై అభిప్రాయాలు సేకరించారు. సాయంత్రం విలేకర్ల సమావేశంలో కొప్పుల రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, టిపిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యతో కలిసి ఉత్తమ్ మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 16 నెలల తరువాత జరిగే ఈ ఉప ఎన్నికతోనే టిఆర్ఎస్ పతనం ప్రారంభం కానుందన్నారు. కెసిఆర్ ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. జిల్లాకు ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. కరువు పరిస్థితులు, పంటలకు మద్దతు ధర లేక, అప్పుల పాలై రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. ఇంటికో ఉద్యోగమని చెప్పిన కెసిఆర్ ఊరుకొక ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఈ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అత్యధికులైన మాదిగలకు ప్రభుత్వంలో చోటు లేకపోవడం శోచనీయమన్నారు. శృతిని ఆటవికంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీపై ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేరకపోగా దళితులపై దాడులు పెరిగాయన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ దళితుల్ని విస్మరిస్తే.. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల దేశంలో దాడులు, దౌర్జన్యాలు, మానబంగాలు నానాటికీ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకుల తీరును పరిశీలిస్తున్న ప్రజలు ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి నాయకుల అభిప్రాయాల మేరకే అభ్యర్థిని ప్రకటించనున్నట్టు తెలిపారు. స్థానికుడా..స్థానికేతరుడా అన్నది ముఖ్యం కాదని, కలిసికట్టుగా ఉండి గెలిపించుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి బలరాంనాయక్, మాజీ ఎంపీ మధుయాష్కీ, కిసాన్ సభ నేత కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ వివేక్ వైపే మొగ్గు !
ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి నాయకులు, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్, మహిళా, కిసాన్ సంఘాల నాయకులతో పాటు ఎంపిపిలు, జెడ్పీటిసిలతో ఎస్సీసెల్ జాతీయ కార్యదర్శి కొప్పుల రాజు సమక్షంలో వేర్వేరుగా అభిప్రాయ సేకరణ జరిగింది. పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ను బరిలోకి దింపడం వల్ల గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అత్యధికుల నుండి అభిప్రాయం వచ్చినట్టు తెలుస్తుంది. ఉదయం 11 గంటల నుండి రాత్రి వరకు ఈ సమావేశాలు నిర్వహించారు.