Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్
- ఇరు దేశాల సౌహార్థ సభ ప్రారంభం
నవతెలంగాణ - సిటీబ్యూరో
ఇండియా - వియత్నాం దేశాల మధ్యన స్నేహ సంబంధాలు వర్థిల్లాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, వియత్నాం పార్లమెంటు సభ్యులు వూ జువాన్ హంగ్ ఆకాంక్షించారు. రాంకోఠిలోని షాలిమార్ ఫంక్షన్ హాల్లో ఆలిండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ (ఎఐపిఎస్ఓ) ఆధ్వర్యంలో 'ఇండో - వియత్నాం పీస్టా -2015'ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ అమెరికాకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసి విజయం సాధించిన వియత్నాం అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్ఫూర్తిదాయకమన్నారు. అభివృద్ధి ఫలాలను ప్రజలకు పంచాలనే కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్న వియత్నాం, క్యూబా, చైనా తదితర దేశాలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రం ముందడుగు వేస్తుందని చెప్పారు. వియత్నాం ఎంపీ వూ జువాన్ హంగ్ మాట్లాడుతూ వియత్నాం వీరుడు హోచిమిన్, నాటి భారత ప్రధాని నెహ్రూ కాలం నుంచి సత్సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. 43 ఏండ్ల నుంచి పారిశ్రామిక సంబంధాలు బలపడ్డాయన్నారు. స్వాతంత్య్ర పోరాటం, ఆర్థిక నిర్మాణం, సాంస్కృతిక సంబంధాల్లో భారత్ - వియత్నాం మధ్యన సారూప్యత వుందన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి. వెంకట్ మాట్లాడుతూ అమెరికాను ఎదిరించిన పోరాటంలో 40 లక్షల మంది వియత్నాం పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ప్రస్తుతం అమెరికాతో కలిసి భారత్ సైనిక విన్యాసాలు చేయడం ఆందోళన కలిగిస్తోం దన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ, వియత్నాం మధ్యన నేరుగా సత్సంబంధాలు కొనసాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఒబేదుల్లా కొత్వాల్, లోక్సత్తా నాయకులు జగన్, సినీ నటుడు మాదాల రవి మాట్లాడారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్టు కార్యదర్శి ఎస్.వినయకుమార్ వందన సమర్పణ చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాయక్, వియత్నాం ఎంపీ హ మిన్ హు, ఎఐపిఎస్ఓ జాతీయ కార్యదర్శి డాక్టర్ డి.సుధాకర్, ఎఐపిఎస్ఓ ప్రధాన కార్యదర్శి పల్లబ్సేన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. వేదికపై ఇరు దేశాల జాతీయ పతాకాల ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. వియత్నాం కళాకారుల సాంస్కృ తిక కార్యక్రమాలు అలరించాయి. ఈ నెల 30 వర కు ఈ సౌహార్థ సభలు కొనసాగుతాయి. మంగళ వారం ఉదయం 32 మంది సభ్యులతో కూడిన వియత్నాం బృందం మహబూబ్నగర్ జిల్లా కొత్తూరులో పర్యటించింది.