Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కెరమెరి/రామగుండం
ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అప్పుల బాధతో ఇద్దరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని కేలి(కే) గ్రామానికి చెందిన నాగర్బోజే రాంకిషన్ (65)కు ఉన్న ఐదెకరాల్లో పత్తి వేశాడు. పెట్టుబడుల కోసం రూ. 3 లక్షల వరకు అప్పు చేశాడు. వర్షాభావ పరిస్థితులతో ఈసారి పత్తి దిగుబడి గణనీయంగా తగ్గింది. ఐదెకరాల్లో రెండు క్వింటాళ్ల పత్తి మాత్రమే రావడంతో అప్పులు ఎట్లా తీర్చాలని తీవ్రంగా బాధపడుతుండేవాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం మధ్యా హ్నం ఇంట్లో ఎవరూ లేనిసమయంలో పురుగుల మందు తాగాడు. వ్యవ సాయ పనులకు వెళ్లిన కుటుంబసభ్యులు ఇంటికి వచ్చేసరికి మృతి చెంది ఉన్నాడు. రాంకిషన్కు భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
ఐదు రోజులు మృత్యువుతో పోరాడి, చివరికి...
కరీంనగర్ జిల్లా రామగుండం మండలం మద్దిరాల గ్రామానికి చెందిన లగిశెట్టి సత్తయ్య(45) తనకున్న ఐదు ఎకరాల్లో రెండు ఎకరాల్లో పత్తి, మూడు ఎకరాల్లో వరి పంట సాగు చేశాడు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రెండు బావులు తవ్వించాడు. బావుల తవ్వకానికి, పంటల పెట్టుబడికి రూ.3 లక్షల వరకూ అప్పు చేశాడు. అయినా పంట చేతికి రాలేదు.
దీంతో సత్తయ్య ఈ నెల 3న పొలంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం రాత్రి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఈ రెండు కేసులు దర్యాప్తులో ఉన్నాయి.