Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దోపిడీకి గురవుతున్న విలువైన ఖనిజ సంపద
- ఏఐసీడబ్ల్యూఎఫ్ బహిరంగ సభలో వక్తలు
నవతెలంగాణ-సింగరేణి ప్రతినిధి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పారిశ్రామికవేత్తల సేవలో తరిస్తూ విలువైన ఖనిజ సంపదను దోపిడీకి గురిచేస్తున్నారని ఆల్ఇండియా కోల్వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐసీడబ్య్లూఎఫ్) మహాసభలో వక్తలు అన్నారు. ఏఐసీడబ్ల్యూఎఫ్ 9వ జాతీయ మహాసభ ఆదివారం గోదావరిఖని పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో వక్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. అభివృద్ధి పేరుతో ప్రజల నుండి ఓట్లు రాబట్టి అధికారంలోకొచ్చిన మోడీ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, బహుళజాతి సంస్థల మార్గదర్శకత్వంలో పని చేస్తున్నారన్నారు. ఆస్ట్రేలియాలో బడా పారిశ్రామికవేత్త ఆదానీ బొగ్గు గనుల నుండి జరిగిన ఉత్పత్తిని భారత్లో అమ్ముకుని వేల కోట్ల లాభాలు ఆర్జించడానికి పథకాలు రూపొందిస్తున్నారన్నారు. నాణ్యత, స్వేచ్ఛా మార్కెట్ పేరుతో విదేశీ సుంకాన్ని లేకుండా చేశారన్నారు. పార్లమెంట్ను, దేశ ప్రజలను అంధకారంలో ఉంచి క్యాపిటివ్ మైనింగ్ గనులు కూడా వ్యాపారం చేయవచ్చనే కొత్త విధానాన్ని తీసుకువచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సీఐఎల్ బొగ్గు పరిశ్రమను క్రమేపి ప్రయివేటీకరించడానికి కుట్ర చేస్తున్నారన్నారు. పోరాటాలు, త్యాగాలతో రూపొందించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి యజమానుల దయాదాక్షిణ్యాలపై కార్మికులు బతికే స్థితి తీసుకువస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ సంపదపై బతికే ఆదివాసీలను నిర్వాసితులగా చేసి అడవి నుండి తరిమేయడానికి పన్నాగాలకు పాల్పడుతున్నారన్నారు. రైతులు, కూలీలు, సంఘటిత, కారట్రాక్టు కార్మికులు ఐక్యంగా పోరాడినందునే బలవంతపు రైతు భూముల స్వాధీన చట్టం పెండింగ్లో పడిందని, ఇదే తరహాలో రానున్న రోజుల్లో పోరాడాలని పిలుపునిచ్చారు. మార్చి 29న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని, మార్చి 7 నుండి 10 వరకు నిబంధనల మేరకు పనులు చేయడం ద్వారా కార్మికులు తమ నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. బొగ్గు పరిశ్రమ రక్షణతో పాటు దేశ రక్షణ కోసం పోరాడాలన్నారు. కార్మికుల హితం కోసం నాలుగు ప్రధాన కార్మిక సంఘాలు ఐక్య పోరాటాలు చేస్తున్నాయని, తమతోపాటు బిఎంఎస్ను కూడా పోరాటంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అధ్యక్షతన జరిగిన మహాసభలో సీఐటియూ జాతీయ కార్యదర్శి తపన్సేన్, ఆల్ ఇండియా కోల్వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జీవన్రారు, వేజ్బోర్డు సభ్యులు రామానంద, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రాజారావు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం.సాయిబాబు, కె.మధు, పి.రాజమణి, సింగరేణి ఏరియాల నాయకులు ఎం.నర్సింహారావు, నాగరాజుగోపాల్, వై.యాకయ్య, ముత్యంరావు పాల్గొన్నారు.