Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వనరులు, ఆస్తులు కాపాడేందుకే పోరాటం :
ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీగౌడ్
నవతెలంగాణ - కరీంనగర్ టౌన్
ప్రాజెక్టుల రీ-డిజైన్పై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణకు సిద్ధమా? అని సీఎం కేసీఆర్కు ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ గౌడ్ సవాల్ చేశారు. కరీంనగర్ నగరంలోని వావిలాలపల్లిలో డీసీసీ అధ్యక్షుని నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టుల రీ-డిజైన్పై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం తమ్మిడిహెట్టి వద్ద నిర్మించడమే సరైందని చెప్పారు. కాళేశ్వరం వద్ద నిర్మించడం వల్ల ప్రజాధనం అదనంగా ఖర్చవుతుందన్నారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు మాసాల్లోనే మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. రిజర్వేషన్లతోపాటు డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూపంపిణీ చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగబోమని సవాల్ చేస్తారా? అని ప్రశ్నలు సంధించారు. ప్రజలు తీవ్ర కరువుతో అల్లాడుతుంటే మద్యం అమ్మకాల్లో లక్ష్యాన్ని అధిగమించామని ప్రభుత్వం సంబరాలు చేసుకోవడాన్ని యాష్కి తప్పుపట్టారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరువు నెలకొన్నప్పటికీ 19 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించడం దారుణమ న్నారు. కరువుపై రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా సమీక్ష నిర్వహించలేదని చెప్పారు. బాబు జగ్జీవన్రామ్ జయంతి రోజున సీఎం ఫాంహౌజ్కే పరిమితమయ్యారని, నివాళులర్పించలేదని అన్నారు. దళితులపై వివక్ష స్పష్టమైందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్రమంగా రూ. కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే వారిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులపై తాము అసెంబ్లీలో వివరిస్తామంటే స్పీకర్ నిరాకరించారన్నారు. ప్రతిపక్ష పార్టీల హక్కులను కాలరాస్తున్నారని, దీనిపై మరోమారు స్పీకర్కు విన్నవి స్తామని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణాలకు కాంగ్రెస్ నేతలను బాధ్యులను చేయడం సరికాదన్నారు. అప్పటి కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో టీఆర్ఎస్ భాగస్వామ్యం ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు ఎందుకు ప్రశ్నించలే దన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షు డు కటకం మృత్యుంజయం, నగర అధ్యక్షుడు కర్ర రాజశేఖర్, నాయకులు జయశ్రీ, ఆకుల ప్రకాశ్ పాల్గొన్నారు.