Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 372 మార్కులకు జేఈఈ అడ్వాన్స్డ్
- పేపర్-2లో ఫిజిక్స్ కఠినం
- టెట్లో పేపర్-1కు 87.10 శాతం పేపర్-2కు 91.83 శాతం హాజరు
నవ తెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ రాతపరీక్ష, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్టెట్) ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రాతపరీక్షలు జరిగాయి. గతానికి భిన్నంగా ఈసారి పేపర్-1, పేపర్-2 మార్కులు సమానంగా 186 మార్కుల చొప్పున మొత్తం 372 మార్కులకు పరీక్ష జరిగింది. జేఈఈ అడ్వాన్స్డ్ పేపర్-2లో ఫిజిక్స్ ప్రశ్నాపత్రం కొంత కఠినంగా వచ్చినట్టు తెలిసింది.పేపర్-2 ఫిజిక్స్ ప్రశ్నాపత్రంలో వ్యాసరూప ప్రశ్నలు ఎక్కువగా రావడం వల్ల విద్యార్థులు కొంత గందరగోళానికి గురైనట్టు సమాచారం. పేపర్-2లో మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నాపత్రాలు కొంత సులభంగానే వచ్చినట్టు తెలిసింది. పేపర్-1లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మూడు సబ్జెక్టుల ప్రశ్నాపత్రాలూ సులభంగానే రావడంతో విద్యార్థులకు ఊరట లభించింది. అయితే ఫిజిక్స్ ప్రశ్నాపత్రం కఠినంగా రావడంతో మార్కులు తగ్గి ర్యాంకుపై ప్రభావం చూపే అవకాశముందని కొందరు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇంకోవైపు ఫిజిక్స్ ప్రశ్నాపత్రం కొంత కఠినంగా ఉన్నా బాగా చదివిన విద్యార్థులకు సులువుగానే ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో చేరాలంటే కఠినమైన ప్రశ్నాపత్రాలుంటేనే బాగా చదివిన విద్యార్థులకు సీట్లు లభిస్తాయని చెప్తున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ రాతపరీక్ష ఆదివారం పేపర్-1 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. జేఈఈ అడ్వాన్స్డ్ రాతపరీక్ష తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, మహబూబ్నగర్లో, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, తిరుపతి నిర్వహించారు. జేఈఈ అడ్వాన్స్డ్కు దేశవ్యాప్తంగా 1,98,228 మంది అర్హత సాధించారు. జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన వారిలో 1.56 లక్షల మంది మాత్రమే అడ్వాన్స్డ్కు దరఖాస్తు చేశారు. వారిలో ఆదివారం జరిగిన రాతపరీక్షకు 95 శాతం మంది అంతే సుమారు 1.48 లక్షల మంది హాజరైనట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల నుంచి 21,305 మంది దరఖాస్తు చేసినా, 20 వేల మంది పరీక్ష రాసినట్టు తెలిసింది. జేఈఈ అడ్వాన్స్డ్ రాతపరీక్ష ఆప్టికల్ రెస్పాన్స్ షీట్ (ఓఆర్ఎస్)ను జూన్ 1న వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. జూన్ 5న ప్రాథమిక కీ విడుదల చేసి, జూన్ 7వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు జూన్ 12న విడుదల చేయనున్నారు.
నేడు టెట్ కీ విడుదల
టెట్ పేపర్-1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా జరిగింది. టెట్ పేపర్-1కు 1,01,213 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 88,158 (87.10 శాతం) మంది హాజరయ్యారు. పేపర్-2కు 2,74,339 మంది దరఖాస్తు చేయగా, 2,51,924 (91.83 శాతం) మంది పరీక్ష రాశారు. టెట్ ప్రాథమిక కీ సోమవారం విడుదల చేయనున్నారు. పదిరోజుల్లో ఫలితాలు ప్రకటించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ప్రసవించిన అరగంటలోనే పరీక్షకు...
మహబూబ్ నగర్ జిల్లా మల్దకల్ మండలానికి చెందిన నిండు గర్భిణి కవిత తన తల్లితో టెట్ రాతపరీక్ష రాయడానికి ఉదయం 8 గంటల సమయంలో ఆమెకు కేటాయించిన జిల్లా కేంద్రంలోని మోడ్రన్ హైస్కూల్కు చేరుకున్నారు. పరీక్షా సమయం సమీపిస్తున్న సమయంలోనే ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. పరీక్షా కేంద్రం నిర్వాహకులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. దీంతో ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొద్ది సేపటికే ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. ఎలాగైనా పరీక్షకు హాజరుకావాలన్న దృఢసంకల్పంతో ఉన్న ఆమె ప్రసవించిన అరగంటలోనే... మోడ్రన్ హైస్కూల్కు చేరుకున్నారు. డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించినా ఆమె వినకుండా పరీక్షకు హాజరయ్యారు. కవిత విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరీక్ష అనంతరం ఆమెకు సరైన వైద్య సదుపాయం అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు.
వరంగల్లో ఓ అభ్యర్థి మృతి
వరంగల్ జిల్లాలో టెట్కు హాజరుకావడానికి వస్తున్న ఓ అభ్యర్థి ప్రమాదంలో మృతి చెందారు. మరిపెడ బంగ్లాకు చెందిన అలువాల రవీందర్, వనజ దంపతులు స్థానికంగా సాహితీ మోడల్ స్కూల్ నడుపుతున్నారు. ఆదివారం టెట్ రాతపరీక్షకు హాజరుకావడానికి జనగామ ధర్మకంచ జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో కేంద్రానికి బయలుదేరారు. వనజ తిరుమలగిరి వరకు బస్సులో ప్రయాణించారు. అక్కడి నుంచి పరీక్షా కేంద్రానికి ఆమె బాబాయి ద్విచక్రవాహనంపై జనగామకు బయలుదేరారు. ఈ క్రమంలో దేవరుప్పల మండలం చింతబావి తండా సమీపంలోకి రాగానే గాలికి ఆమె చున్నీ వెనుక చక్రంలో పడింది. దీంతో ఆమె ఒక్కసారిగా కిందపడ్డారు. ఆమె తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరోవైపు వరంగల్ జిల్లా సుందరయ్య నగర్ జడ్పీహెచ్ఎస్లో అభ్యర్థులకు ఓఎంఆర్ జవాబు పత్రానికి బదులు బఫర్ షీట్ ఇవ్వడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. డీఈవో రాజీవ్ ఆ పాఠశాలకు వెళ్లి సమస్యను తెలుసుకొని పరిష్కరించారు. దీంతో అభ్యర్థులు పరీక్ష రాశారు.