Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ఎన్డీ ల్యాబ్లో మంటలు
- రూ.15 లక్షల ఆస్తినష్టం
- విద్యుద్ఘాతమా.. కెమికల్ రియాక్షనా..!
నవతెలంగాణ - నాచారం
హైదరాబాద్ నాచారం పారిశ్రామికవాడ రోడ్డు నెం.3లో రిలి మార్క్ ప్రొడక్టు, సర్వీస్ ఆర్ఎన్డీ కెమికల్ ల్యాబ్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రిసార్స్ ల్యాబ్, ఎనాలసిస్ ల్యాబ్ కాలిబూడిదయ్యాయి. ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు కంపెనీ నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, ఫైర్స్టేషన్కు సమాచారమందించారు. ఫైర్ సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఆదివారం సెలవు కావడంతో కార్మికులు లేక ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దాదాపు రూ.15 లక్షల ఆస్తి నష్టం జరిగిందని ఫైర్ అధికారుల అంచనా. శాలిస్ స్లైట్ కెమికల్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగి వారం రోజులు గడువకముందే ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా కంపెనీ పక్కనే సుప్రభాత్ మోడల్ స్కూల్ ఉన్నది.
ఘటనా స్థలాన్ని సందర్శించిన ఏసీపీ
సంఘటనా స్థలాన్ని మల్కాజిగిరి ఏసీపీ రవిచందర్రెడ్డి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రఘుప్రసాద్, కాప్రా కమిషనర్ సరోజ, ఉప్పల్ రెవెన్యూ అధికారులు సందర్శించి వివరాలు సేకరిం చారు. కెమికల్ ల్యాబ్ నిర్వాహకుడు డాక్టర్ కసబ్పై నాచారం ఇన్స్పెక్టర్ ప్రవీందర్రావు కేసు నమోదు చేశారు. విద్యుద్ఘాతమా.. కెమికల్ రియాక్షనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
అనుమతులు లేవు...
ఆర్ఎన్డి కెమికల్ ల్యాబ్ను ఏడాది నుంచి నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీకి కనీసం పారిశ్రామిక మున్సిపల్, ఫ్యాక్టరీ అనుమతులు లేవని పారిశ్రామిక నోటిఫైడ్ సొసైటీ, ఇతర పారిశ్రామికవేత్తలు తెలిపారు. నాచారం పారిశ్రామి కవాడలో అనుమతులు లేకుండా అనేక పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని పలువురు బాహాటంగా చెబుతున్నా.. సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీనిఫలితంగానే అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయని ప్రజలు వాపోతున్నారు.