Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఖమ్మం జిల్లాలోనే 9మంది
నవతెలంగాణ-విలేకర్లు
వడదెబ్బతో సోమవారం 17మంది మృతిచెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుల వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ : కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన నాగిశెట్టి కుమారస్వామి(35) గ్యాస్ స్టవ్లు రిపేరు చేసేవాడు. ఆదివారం పలుగ్రామాలు తిరిగి అస్వస్థతకు గురై సోమవారం మృతిచెందాడు. హుజూరాబాద్ మండలంలో ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన మంద సుమతి(50) కుమారుని పెండ్లి సోమవారం ఉన్నది. ఎండలో పనులు చేయడంతో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. సిరిసిల్ల మండలం సారంపెల్లికి చెందిన ఉపాధి కూలీ గడ్డమీది కనుకవ్వ(45) మృతిచెందింది. అదే గ్రామానికి చెందిన రాజ్ మహ్మద్(65) టైర్ల పంచర్ దుకాణంలో పనిచేస్తూ అస్వస్థతకు గురై మృతిచెందాడు. నిజామాబాద్ :నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం అయ్యపల్లి గ్రామానికి చెందిన పోచారం కిష్టయ్య(35) వంట చెరుకు కోసం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికెళ్లి అస్వస్థతకు గురై మృతిచెందాడు. మెదక్ :మెదక్ జిల్లా దుబ్బాక నగర పంచాయతీ పరిధిలోని దుంపలపల్లి గ్రామానికి చెందిన సామయ్య(55) కూలి పనిచేసే సమయంలో వడదెబ్బ తగిలి మృతి చెందాడు. ఖమ్మం : ఖమ్మం జిల్లా కారెపల్లి మండలం కారెపల్లి అడ్డరోడ్కు చెందిన ఆటోడ్రైవర్ షేక్ చిన్నమౌలాలి(36) ఎండకు తట్టుకోలేక మృతిచెందాడు. అదే గ్రామానికి చెందిన బొమ్మల రవి(28) ఉపాధి కూలీ. వారం రోజుల కిందట అస్వస్థతకు గురయ్యాడు. ఖమ్మం అస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం మృతిచెందాడు. దుమ్ముగూడెం మండలం కాల్సా రేగుబల్లి గ్రామానికి చెందిన కొర్సా పెద్ద రామయ్య(65) పత్తి చేలో మోడు తీయడానికెళ్లి అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఖమ్మం నగర కార్పొరేషన్ పరిధిలోని గోపాలపురానికి చెందిన లకావత్ లాలూ(56) ఆదివారం పొలం పనులకెళ్లి ఎండ తీవ్రతకు అనారోగ్యానికి గురయ్యాడు. పరిస్థితి విషమించి చనిపోయాడు. పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన షేక్లాల్సాహెబ్(70) పొలం పనులకెెళ్లి అస్వస్థతకు గురై మృతిచెందాడు. కొణిజర్ల మండల కేంద్రానికి చెందిన కూలీ దుగ్యాల శ్రీను(40) పనులకెళ్లి మృతిచెందాడు. ఖమ్మం త్రీటౌన్ ప్రాంతానికి చెందిన సిరికొండ సైదాచారి(45) వడగాల్పులకు తట్టుకోలేక ప్రాణం కోల్పోయాడు. చండ్రుగొండ మండలం యర్రగుంట గ్రామానికి చెందిన తాపీమేస్త్రి ఎస్కె.రఫీ(38) పనులకెళ్లి అస్వస్థతకు గురై మృతి చెందాడు. గార్ల మండలం దేశ్యాతండాకు చెందిన కూలీ భూక్య.సుక్కి(38) ఎండలో పనిచేయడంతో మృతిచెందింది. మహబూబ్నగర్ : బాలానగర్ మండలం చెన్నవెల్లి గ్రామానికి చెందిన శంకర్రెడ్డి(65) పొలం పనులకెళ్లి వడదెబ్బతో మృతిచెందాడు. గోపాల్పేట మండలం కొల్కెపహాడ్ గ్రామానికి చెందిన వడ్డెమాన్ బాలమ్మ(65) ఐదు రోజుల క్రితం వడదెబ్బకు గురైంది. వాంతులు, విరేచనాలయ్యాయి. చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి సోమవారం మృతిచెందింది.