Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్లో నాయక్ను అడ్డుకున్న కార్యకర్తలు
- రైతుకమిటీల ఎంపికపై టీఆర్ఎస్లో రగిలిన చిచ్చు
నవతెలంగాణ-మహబూబాబాద్
మానుకోట గులాబీతోటలో రైతు సమన్వయ సంఘాల చిచ్చు రగిలింది. ఎమ్మెల్యే శంకర్నాయక్ ఏకపక్షంగా తన గ్రూపునకు చెందిన వారినే కమిటీల్లో నియమించారని గులాబీ తమ్ముళ్లు ఆగ్రహం వెళ్లగక్కారు. ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ మహబూబాబాద్ మండలాధ్యక్షులు వెన్నం శ్రీకాంత్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వరంగల్లో బుధవారం సర్క్యూట్ గెస్ట్హౌజ్లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ఫిిర్యాదు చేశారు. మహబూబాబాద్ మండలంలో రెడ్యాల, మల్యాల, రజాలిపేట, బేతోలు, ముడుపుగల్ గ్రామాల్లో పార్టీ నాయకులను కాదని, స్థానిక నాయకత్వానికి సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే ఏకపక్షంగా కమిటీలు వేసుకున్నారని కడియం దృష్టికి తీసుకెళ్లారు. ఆయా గ్రామాల్లో రైతులను కాదని మద్యంప్రియులకు, రియల్ వ్యాపారులకు, రైతులను మోసం చేసిన వారినే సంఘాలలో నియమించారని ఫిర్యాదు చేశారు. నిజమైన కార్యకర్తలకు గుర్తింపులేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం రైతు సంఘల కమిటీలను రద్దు చేయాలని కోరారు. ఎమ్మెల్యే దయాకర్రావుకు కూడా శంకర్నాయక్ స్థానికంగా వ్యవహరిస్తున్న తీరును వివరించారు. తనపై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ఫిర్యాదు చేస్తున్న విషయం తెలుసుకుని ఎమ్మెల్యే శంకర్నాయక్ అక్కడకు వెళ్లగా... ఆయనను కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇరుగ్రూపులను శాంతింపచేశారు. ఇప్పటికే ఈ రగడ గురించి మంత్రి చందూలాల్, జిల్లా పూర్వ అధ్యక్షులు తక్కెళ్ళపల్లి రవీందర్రావుకు తెలియజేసిన విషయం విదితమే. ఫిర్యాదు చేసిన వారిలో మాజీ జెడ్పీటీసీ యాదగిరిరెడ్డి, బొద్దుగొండ ఎంపీటీసీ మల్లేషం, ఉపసర్పంచ్ యాకయ్య, గుండంగ బాలు, జెర్రిపోతుల వెంకటయ్య, నల్లపు ఉపేందర్ రెడ్డి, రాజవర్దన్ రెడ్డి, కొండల్ రావు, వేల్పుల వెంకన్న, వెంకట నారాయణ ఉన్నారు.