Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమన్వయ కమిటీలో చేర్చుకోండి
- ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్న ఎన్కేపల్లి ఉపసర్పంచ్
నవతెలంగాణ-చేవెళ్ల
'కాల్మొక్తమ్ సార్. మేమూ టీఆర్ఎస్ పార్టీ నాయకులమే. సమన్వయ కమిటీలో మా పేర్లు చేర్చండి' అంటూ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఎన్కేపల్లి ఉప సర్పంచ్ మహేందర్రెడ్డి ఎమ్మెల్యే కాలె యాదయ్య కాళ్లు పట్టుకున్నారు. ఆయన కారు ముందు గ్రామస్తులు బైటాయించి బుధవారం ఆందోళన చేపట్టారు. చేవెళ్ల మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే వచ్చారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేకారును ఎన్కేపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. 'మమ్ముల్ని కాదని వేరే వారికి స్థానం కల్పించవద్దు. టీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని బతుకుతున్నం. పార్టీకోసం ప్రాణాలైనా ఇస్తాం. మాకు అన్యాయం చేయొద్దు. స్థానం కల్పించండి' అంటూ ఎమ్మెల్యేని వేడుకున్నారు. 'భూములు లేని వారిని కమిటీల్లో చేర్చి మాకు అన్యాయం చేస్తున్నారు. ఇది సరిగాదు' అని ప్రాధేయపడ్డారు. కమిటీలో స్థానం కల్పించాలని కోరితే పార్టీలోని కొంత మంది నాయకులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని వాపోయారు. ఈ మేరకు ఎమ్మెల్యే కారు దిగి ఆందోళన చేస్తున్న గ్రామస్తులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులు శాంతించకుండా ఎమ్మెల్యేను నిలదీశారు. న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు సమన్వయ కమిటీలతో గ్రామాల్లో చిచ్చురేగుతుందని, అక్కడున్న ఉపాధ్యాయులంతా నివ్వెరపోతూ చర్చించుకున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎన్కేపల్లి గ్రామస్తులు మహిపాల్రెడ్డి, రాఘవేందర్గౌడ్, మహేందర్గౌడ్, లింగం, పాండు, నర్సింలు, వెంకటేశ్, శ్రీను, రవీందర్రెడ్డి తదితరులు ఉన్నారు.