Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కమిషనరేట్ ఎదుట వివిధ పార్టీల నేతల మౌనదీక్ష, అరెస్ట్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వం జారీ చేసిన జీవో 39ని రద్దు చేయాలంటూ సోమవారం వ్యవసాయ కమిషనరేట్ ఎదుట టీజేఏసీ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నేతులు మౌనదీక్ష నిర్వహించారు. జీవో 39పై రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పట్టించుకోలేదు. దీంతో ప్రతిపక్షాలు ఆందోళనబాటపట్టాయి. ఇందులో భాగంగానే వ్యవసాయ శాఖ కమిషనరేట్ వద్ద టీజేఏసీ ఆధ్వర్యంలో మౌనదీక్షకు కూర్చున్నారు. దీనిని పోలీసులు అంగీకరించలేదు. పోలీసుల నుంచి ఒత్తిడి వచ్చినా నేతలు పట్టించుకోకుండా తమ దీక్షను కొనసాగించారు. వినక పోవడంతో వారిని పక్కకు తప్పించేందుకు పోలీసులు యత్నించారు. ఇరువైపులా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ను అరెస్ట్ చేశారు. అనంతరం టిడిపి అధ్యక్షడు ఎల్ రమణ, కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బిజెపి ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్రావును కూడా అరెస్ట్ చేసి బేగంపేట పోలీస్స్టేషన్కు తరలించారు.
మౌనదీక్ష చేసే స్వేచ్ఛ లేదా.?; కోదండరామ్
ప్రజల సమస్యల పరిష్కారం కోసం మౌనదీక్ష చేసే స్వేచ్ఛ కూడా లేదా..? అని కోదండరామ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, జారీ చేస్తున్న జీవోలు, ఆదేశాల కారణంగా వ్యవస్థలకు విఘాతం కలుగుతోందని ఆయన తెలిపారు. జీవో 39 తెచ్చి రైతులకు సమస్యలు తెచ్చి పెడుతున్నారని ఆరోపించారు. ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.