Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రణాళిక లేకే కష్టాలు
- బెడిసికొట్టిన సూరత్ ప్రయోగం
- ప్రభుత్వం ప్రకటించిన ఒక్కో చీర విలువ రూ.224
- పంపిణీ చేసిన వాటి రేటు కేవలం రూ.70
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చీరల పంచాయతీతో టీఆర్ఎస్ సర్కారు ఉక్కిరిబిక్కిరైంది. బతుకమ్మ పండగ నేపథ్యంలో పేద మహిళలకు పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన చీరల నాణ్యతపై వెల్లువెత్తిన నిరసనలు, వాటిని మహిళలు దహనం చేయటంలాంటి ఘటనలతో ప్రభుత్వ పెద్దలు అయోమయంలో పడ్డారు. ముందస్తు ప్రణాళిక లేకుండా హడావుడిగా సిరిసిల్ల మరమగ్గం కార్మికులకు ఆర్డర్లివ్వటం, ఆ తర్వాత పండుగ నాటికి చాలినన్ని చీరలు ఉత్పత్తి చేయలేరనే ఉద్దేశంతో.. సూరత్ నుంచి తెప్పించటం తదితర చర్యలు బెడిసికొట్టాయి.
మరోవైపు చీరల నాణ్యతపై ఇటు చేనేత ప్రతినిధులు.. అటు కార్మికులు అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. వాటికి కేటాయించిన డబ్బులు, పంపిణీ చేసిన చీరల ధర తదితరాంశాలపై వారు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ చీరల తయారీ కోసం ప్రభుత్వం ఏకంగా రూ.224 కోట్లను కేటాయించింది. వీటితో కోటి చీరలను ఉత్పత్తి చేయిస్తామంటూ ప్రకటించింది. అంటే ఒక్కో చీర విలువ రూ.224 అన్నమాట. కానీ సోమవారం పంపిణీ చేసిన ఒక్కో చీర ధర రూ.60 నుంచి రూ.70 ఉండబోదని చేనేత నిపుణులు తెలిపారు. దీన్నిబట్టి అత్యంత నాణ్యతలేని, నాసిరకం చీరలను పేద మహిళలకు ప్రభుత్వం అంటగట్టిందని వారు విమర్శిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన విలువకు, పంపిణీ చేసిన చీరల విలువకు మధ్య రూ.154 వ్యత్యాసముండటంతో.. ఈ డబ్బు ఎక్కడికి పోయిందనే ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. ఆ ప్రకారంగా రూ.154 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వ అధికారులు, వస్త్ర వ్యాపారులు కొల్లగొట్టారనే సందేహం రాకమానదని పలువురు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అది పాతస్టాకే..
సూరత్ నుంచి ప్రభుత్వం తెప్పించిన చీరలన్నీ పాత స్టాకేనని సమాచారం. సిరిసిల్లలో మరమగ్గాల మీద నేసిన చీరలను ప్రాసెసింగ్, డైయింగ్, కలరింగ్ (రంగులు అద్దటం) కోసం సూరత్కు పంపారు. డైయింగ్ తర్వాత తిరిగి వాటిని మన రాష్ట్రానికి తీసుకు రావాల్సి ఉంది. కానీ ఆ చీరల్లో అత్యధిక సంఖ్యను అక్కడే ఉంచిన అధికారులు.. మొత్తంగా సూరత్లో నేసిన చీరలనే ఇక్కడకు తెప్పించారు. అయితే అవన్నీ సంవత్సరం క్రితం ఉత్పత్తి చేసి.. స్టాక్ చేసినవేనని పేరు చెప్పటానికి నిరాకరించిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. నాణ్యత లేకపోవటంతో వాటిని వినియోగదారులు కొనుగోలు చేయలేదని.. వాటినే తెలంగాణాకు పంపించారని సమాచారం. ఈ క్రమంలోనే వాటిని తీసుకున్న మహిళలు ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. దీంతో సర్కారు కక్కలేక.. మింగలేక.. విషయాన్ని వివరంగా చెప్పలేక నానా అవస్థలు పడింది. మరోవైపు సూరత్లో సాదాసీదా, నాసిరకం చీరలను తూకం వేసి అమ్మటం పరిపాటి. కేజీకి ఆరు నుంచి ఏడు చీరలు తూగుతాయని తెలిసింది. ఈ ఏడు చీరల విలువ కేవలం రూ.100కి మించి ఉండబోదు. దీన్నిబట్టి చీరల నాణ్యత విషయంలో సర్కారు చిత్తశుద్ధి తేటతెల్లమైంది.
శ్వేతపత్రం విడుదల చేయాలి..
- కూరపాటి రమేశ్- ప్రధాన కార్యదర్శి, తెలంగాణ చేనేత కార్మిక సంఘం
''బతుకమ్మ చీరల పంపిణీలో చోటు చేసుకున్న పరిణామాలన్నింటిపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. సిరిసిల్లలో ఎప్పుడు, ఎన్ని చీరలకు ఆర్డరిచ్చారు? వాటిలో ఎన్ని తయారయ్యాయి? సూరత్ నుంచి ఎన్ని చీరలను తెప్పించారు? మొత్తం ఎన్ని కోట్లను కేటాయించి, ఎంత ఖర్చు చేశారు? తదితరాంశాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చీరల కోసం రూ.224 కోట్లను కేటాయించిన సర్కారు.. ప్రచారం కోసం అదనంగా మరికొన్ని కోట్లను గుమ్మరించింది. తద్వారా ఎంతో ప్రజాధనం దుర్వినియోగమైంది. ఈ నేపథ్యంలో సర్కారు శ్వేతపత్రం విడుదల చేయటం ద్వారా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. చీరలను తగలబెట్టిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయటం దారుణం. వాటిని వెంటనే ఎత్తేయాలి..''