Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీజీ వెంకటేశ్ వైఖరిని ఖండించిన తమ్మినేని
- టీడీపీ వైఖరి ఇదేనా..?
- చంద్రబాబు సమాధానం చెప్పాలి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సామాజిక వేత్త ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై టీడీపీ ఏపీ నాయకులు, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఐలయ్యను నడిరోడ్డు మీద ఉరి తీయాలంటూ టీజీ వ్యాఖ్యానించటం అత్యంత గర్హనీయమని ఒక ప్రకటనలో విమర్శించారు. టీజీ వ్యాఖ్యలను తమ్మినేని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. సామాజికవేత్తలు, ఉద్యమకారులపట్ల టీడీపీ వైఖరి ఇదేనా? అని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐలయ్య రాసిన పుస్తకంపై అభ్యంతరాలుంటే చర్చించవచ్చు, విమర్శించవచ్చు.. ఆ విషయాలను వదిలిపెట్టి మత ఛాందసవాదిలాగా ఉరి తీయాలంటూ మాట్లాడటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. దీని వెనుక ఆరెస్సెస్ హస్తముందని పేర్కొన్నారు. గతంలో కూడా ఆరెస్సెస్, ఇతర హిందూత్వశక్తులు ఐలయ్యను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు దిగాయని గుర్తుచేశారు. ఇలాంటి చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తమ్మినేని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఐలయ్యను చంపుతామనడం అనాగరికం :
మానవ హక్కుల వేదిక తమ గుర్తింపును వెల్లడించని కొంత మంది వ్యక్తులు సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పేరుతో పుస్తకాన్ని రాసిన ప్రొఫెసర్ కంచ ఐలయ్యను చంపుతామని బెదిరించడం అనాగరికమని మావన హక్కుల వేదిక అధ్యక్షులు జీవన్కుమార్, ఉపాధ్యక్షులు జీ.మాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు. భావప్రకటనా స్వేచ్ఛ మనిషి ప్రాథమిక హక్కన్నారు. ఆ పుస్తకం శీర్షిక తమ మనషులను గాయ పరిచిందని వైశ్య కులస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని, ప్రత్యామ్యాయ ఆలోచనను వ్యక్తీకరించిన ఐలయ్యను చంపుతామని సంఫ్ు పరివార్కు చెందిన వారు బెదిరిస్తున్నారన్నారు. ఇటువంటి కుట్రలో వైశ్యులు భాగం కావొద్దని కోరుతున్నామన్నారు. ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలను ఖండిస్తూ ఇంకోక పుస్తకం రాసే హక్కు వైశ్య వేధావులకుందన్నారు.