Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వచ్చినా మా బతుకులు మారలే
- ఏ ఒక్క హోంగార్డు కుటుంబమూ బాగోలేదు
- సీఎం మోసం చేశారని సూసైడ్ నోట్
నవతెలంగాణ-భిక్కనూరు
''తెలంగాణ వచ్చినా మా బతుకులు మారలేదు. రాష్ట్రంలో ఒక్క హోంగార్డు కుటుంబం ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు...... సీఎం చెప్పిన మాటలకు మా బతుకులు మారతాయి. మేం సంతోషంగా ఉంటాము అనుకొని ఎదురుచూసీ, చూసీ మా బతుకులు ఇంతే ఇక మారవు అని తనువు చాలిస్తున్నాను. వచ్చే జీతం చాలక, ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఆత్మహత్య చేసుకుంటున్నా....'' అంటూ లేఖ రాసి మరీ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో సోమవారం జరిగింది. బంధువుల వివరాల ప్రకారం... ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన శివ (37) హోంగార్డు. ప్రస్తుతం భిక్కనూరు సీఐ జీపు డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. తెలంగాణ వచ్చాక పర్మినెంట్ చేస్తామని సీఎం పలుమార్లు చెప్పడంతో ఇక మా జీవితం బాగుపడుతుందని ఆశపడ్డాడు. మూడున్నరేండ్లు గడిచినా పర్మినెంట్ కాలేదు. మరోవైపు చాలీచాలని జీతంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో కుటుంబపోషణ భారమైంది. తనను పర్మినెంటు విషయమై నిరంతరం మనస్తాపానికి గురయ్యేవాడు. ఈ క్రమంలోనే సోమవారం తన ఇంట్లో ఉరేసుకున్నాడు. 'నేను చావడానికి కారణం ఆర్థిక పరిస్థితులు మరియు హోంగార్డుగా పనిచేస్తున్నందుకు.. ఎందుకంటే ఏ ఒక్క హోంగార్డు కుటుంబం సంతోషంగా లేదు. మన తెలంగాణ వచ్చాక మా బతుకులు మారతాయి అనుకున్నము. కానీ ఇన్ని దినములు అయినా మా బతుకులు మారలేవు. సాక్షాత్తు మన సీఎం గారు అసెంబ్లీ సమావేశంలో మాకు పర్మినెంట్ చేస్తాను అని ప్రకటించినా చేయలేదు. ఎదురుచూసిచూసి ఇక మా బతుకులు ఇంతే అని బతుకు చాలిస్తున్నాను. అమ్మానాన్న, పెద్దన్న మీరు నన్ను క్షమించాలి. నా గురించి ఏడవకండి నా కూతుర్ని, భార్యను ప్రేమతో చూసుకోండి'' అని లేఖలో పేర్కొన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.