Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల ఒత్తిడితోనే చేశామంటున్న ఏపీ
- తప్పుపట్టిన తెలంగాణ..
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
తెలంగాణ అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ ఏపీ నీటిపారుదల శాఖ పోతిరెడ్డిపాడు నుంచి మళ్లీ నీరు విడుదల చేసింది. ఈ విషయాన్ని శ్రీశైలం ప్రాజెక్టు వద్ద పని చేస్తున్న తెలంగాణ ఇంజనీర్లు ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. బుధవారం ఉదయం ఏడుగంటల నుంచి ఐదు గేట్లను ఎత్తి ఆరువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు వారు తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి సోమవారమే నీటి విడుదల ప్రారంభం కాగా మంగళవారం తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయటంతో పాటూ బోర్డుకు లేఖ రాయటంతో తాత్కాలికంగా మంగళవారం సాయంత్రం నుంచీ నీటి విడుదల నిలిపివేశారు. తాము కేవలం తాగునీటి కోసమే నీరు విడుదల చేస్తున్నట్టు ఏపీ అధికారులు బోర్డు దృష్టికి తెచ్చారు. కర్నూలు జిల్లాకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్దకు బుధవారం ఉదయమే చేరుకున్నారని, వారి ఒత్తిడి మేరకు నీటిని విడుదల చేశామని ఏపీ అధికారులు తాజాగా వివరణ ఇచ్చారు. దీనిని తెలంగాణ అధికారులు తప్పుపట్టారు. కొందరు అధికారులే అక్కడి రైతులను రెచ్చగొట్టి ఇటువంటి నాటకం ఆడిస్తున్నారని ఆరోపించారు. బోర్డు అనుమతి లేకుండా ఏపీ మళ్ళీ నీటిని విడుదల చేయటంపై కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శికి తెలంగాణ ఈఎన్సీ మళ్ళీ ఫిర్యాదు చేశారు. రాయలసీమ తాగునీటి అవసరాల కోసం ఐదు టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా విడుదల చేయటానికి అనుమతించాలని ఏపీ నీటిపారుదల శాఖ ఇటీవల బోర్డును కోరింది. కల్వకుర్తి ద్వారా 4 టీఎంసీల నీటిని వినియోగించుకోవటానికి అనుమతించాలని తెలంగాణ కూడా కోరింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలు రాసిన లేఖలపై బోర్డు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. బోర్డు అనుమతి లేకుండా ఏపీ నీరు విడుదల చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ ఇంజనీర్ చీఫ్ మంగళవారం బోర్డుకు రాసిన లేఖలో సాగర్కు వెంటనే నీరు విడుదల చేయాలని కోరారు. తాగునీటి కోసం నీటి విడుదల ప్రణాళిక ఖరారు చేయటానికి వెంటనే బోర్డు సమావేశం నిర్వహించాలని ఆయన కోరారు. దీనిపై బోర్డు అధికారులు ఇంకా స్పందించలేదు.