Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆన్లైన్లో పొందుపరిచేందుకు నెలాఖరు వరకూ గడువు
- పర్యవేక్షణకు ఎంఈఓ,హెచ్ఎంలతో కమిటీలు
- అటెండెన్స్ జిరాక్స్ ప్రతులనూ సేకరిస్తున్న వైనం
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
ప్రయివేటు పాఠశాలల్లో శిక్షణలేని ఉపాధ్యాయులపై పాఠశాల విద్యాశాఖ దృష్టిసారించింది. 2019 మార్చి తర్వాత పాఠశాలల్లో అన్ట్రైనీ టీచర్లు ఉండొద్దని ఎంహెచ్ఆర్డీ ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయికి కదిలారు. రాష్ట్రంలో వాస్తవంగా ఎంతమంది శిక్షణ లేని టీచర్లు ఉన్నారనే వివరాలను తెలుసుకునేందుకు చర్యలు చేపట్టారు. మండలస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు. ఈనెలాఖరులోగా పూర్తి వివరాలు అందించాలని ఇప్పటికే పాఠశాల విద్య కమిషనర్ జి కిషన్..ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశారు.
2014-15 అధికారిక లెక్కల ప్రకారం 10,799 ప్రయివేటు పాఠశాలల్లో ఉపాధ్యాయ శిక్షణ లేని వారు 4,048 టీచర్లు ఉన్నారు. వీరు 31జిల్లాల పరిధిలో ఉన్నారు. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 584మంది, నిజామాబాద్ జిల్లాలో 450కి పైగా ఉన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో ఉపాధ్యాయ శిక్షణ లేని టీచర్లు విద్యాబోధన చేయడానికి అనర్హులు. ఈ చట్టం అమలులో భాగంగా 2019మార్చి నెలాఖరులోగా శిక్షణ లేని ఉపాధ్యాయులను తొలగించాలని కేంద్రం ఇటీవల ఆదేశాలు జారీచేసింది. శిక్షణలేని టీచర్ల కోసం కేంద్రప్రభుత్వ ఉపాధ్యాయశిక్షణ సంస్థలు బ్రిడ్జ్జికోర్సులను తీసుకొచ్చాయి. ఆరునెలల్లోనే శిక్షణ పూర్తి చేసుకునేలా అవకాశం కూడా ఇస్తున్నది. దీన్ని ఉపయోగించుకోవాలని విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు.
నెలాఖరు వరకూ గడువు
ప్రస్తుతం ఉన్న శిక్షణ లేని ఉపాధ్యాయుల వివరాలు తప్పని అధికారులే చెబుతున్నారు. దీంతో వాస్తవ వివరాల కోసం పాఠశాల విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. దీనిలో భాగంగా ఈనెలాఖరులోగా ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు అన్ట్రైనీ టీచర్ల వివరాలను విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపర్చాలని ఆదేశాలు జారీచేశారు. ప్రతి మండలంలో ఎంఈఓ, హెచ్ఎంలతో కమిటీలు వేశారు. ప్రస్తుతం ఆ కమిటీలు మండలంలోని అన్ని ప్రయివేటు పాఠశాలలను పర్యవేక్షిస్తున్నాయి. అధికారుల ఆదేశాల మేరకు పాఠశాల సందర్శనలో పాఠశాలల్లో టీచర్ల అటెండెన్స్ రిజిస్ట్రర్స్ జిరాక్స్ పత్రులను తీసుకుంటున్నారు. వివరాలు ఆన్లైన్లో పొందుపరిచేందుకు ఈనెల 15వరకు తొలుత గడువిచ్చినా, యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు ఈనెలాఖరు వరకు పొడగించారు. దీని పర్యవేక్షణ కోసం విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే పలుమార్లు డీఈఓలతో సమావేశాలు నిర్వహించారు. ఇటీవల తల్లిదండ్రులు, యాజమాన్యాలతో జరిగిన సమావేశంలోనూ దీని ప్రాధాన్యత వివరించారు. దీనిద్వారా అన్ట్రైనీ టీచర్లతోపాటు మొత్తం ఎంతమంది టీచర్లున్నారనే విషయం బయటపడుతుందని అధికారులు భావిస్తున్నారు.