Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే నెల 9,10,11న మహాధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 23న శనివారం సదస్సు నిర్వహించనున్నట్టు బ్యాంకు, ఇన్సూరెన్స్, రైల్వే, రక్షణ కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. బుధవారం సీఐటీయూ కార్యాలయంలో ట్రేడ్ యూనియన్ల సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు.రాష్ట్ర సదస్సు గురించి చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సాయిబాబు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని అన్నారు. ఇన్సూరెన్స్, రక్షణ, ఫార్మా రిటైల్ వ్యాపారంలో ఎఫ్డీఐలకు తలుపులు తెరిచిందన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.18వేలు ఉండాలని డిమాండ్ చేసినా పట్టించుకోవడం లేదన్నారు. 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా కుదించి, యాజమాన్యాలకు వెట్టిచాకిరీ చేయించాలని చూస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మూసివేసిన పరిశ్రమలను తెరిపించడంలో విఫలమైందన్నారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నవంబరు 9,10,11న 'పార్లమెంటు మహాధర్నా'కు కార్మిక సంఘాలు పిలుపుని చ్చాయని చెప్పారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయు, ఎఐయుటీయూసీ, ఐఎఫ్టీయు, టీఎన్టీయుసీ, ఐఎఫ్టీయు, బ్యాంకు, ఇన్సూరెన్స్, రైల్వే, రక్షణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఫెడరేషన్లు ఈ నెల 23న నాంపల్లిలోని గాంధీభవన్లో నిర్వహించే సదస్సులో ఉద్యోగులు, కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎఐటీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్రావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రెండేండ్లలో రెండు దేశ వ్యాప్త సమ్మెలు జరిగాయని చెప్పారు. రాష్ట్రంలో ఆశ, అంగన్వాడీ వర్కర్లు, పరిశ్రమల కార్మికులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, అసంఘటిత కార్మికులు ఉద్యమాలు నిర్వహించినా, ప్రభుత్వంలో మార్పు రాలేదని విమర్శించారు.తెలంగాణలో బలమైన కార్మికోద్యమాన్ని నిర్మించేందుకు సంఘాలన్నీ సిద్దమవుతున్నాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఐఎఫ్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ. నరేందర్, ఐఎఫ్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్ ఎల్ పద్మ, హెచ్ఎమ్ఎస్ నాయకులు గోపాల్, టీఎన్టీయుసీ నేత బోస్తోపాటు ఇతర రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.