Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలుత అందరికీ ఇస్తామన్న సర్కారు
- ఇప్పుడేమో లాటరీ తీస్తామంటున్న అధికారులు
- ఏడాదికి 100 మందికి చొప్పున పంపిణీ
- ఇలాగైతే తమకు మగ్గాలు ఎప్పుడొస్తాయంటున్న కార్మికులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సిరిసిల్లలో ఉన్న నేతన్నలందరికీ నాలుగు మరమగ్గాల చొప్పున అందిస్తాం.. తద్వారా కార్మికులందర్నీ యజమాను లుగా మారుస్తామంటూ మంత్రి కేటీఆర్ ఎన్నికల సమయంలో వాగ్దానమిచ్చారు. ఇది జరిగి మూడున్నరేండ్లు కావస్తున్నది. అయినా.. మంత్రి వాగ్దానం నేటికీ నెరవేర లేదు. దీంతో సిరిసిల్లలోని మరమగ్గం కార్మికులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. మరోవైపు ప్రభుత్వం తాజాగా.. ఒకేసారి అందరికీ మగ్గాలను ఇవ్వలేమంటూ ప్రకటించటంతో వారు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేతన్నలకు వర్క్షెడ్లను ఏర్పాటు చేసేందుకోసం సర్కారు కొంత భూమిని సేకరించింది. మగ్గాలను అందించేందుకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశామంటూ అధికారులు చెబుతున్నా అది కార్యరూపం దాల్చకపోవటం గమనార్హం. సిరిసిల్ల పట్టణంలో దాదాపు 40వేల మంది మర మగ్గం కార్మికలున్నారు. చుట్టుపక్కల కలిపి మరో 20 వేల మంది నేతన్నలున్నారు. వీరందరికీ ఒక్కొక్కరికి నాలుగు మరమగ్గాలను అందజేస్తామంటూ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఒక్కో మగ్గం ధర కనిష్టంగా రూ.50 వేల నుంచి గరిష్టంగా రూ.4 లక్షల వరకూ (మగ్గం రకాన్నిబట్టి) ఉంటుంది.
వీటిలో జెట్, ఎయిర్ జెట్లూమ్, సెమీ ఆటోమేటిక్ తదితర రకాలున్నాయి. వీటి మొత్తం ధరలో ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తుంది. 30 శాతం బ్యాంకుల నుంచి రుణాల రూపంలో అందిస్తారు. మరో 20 శాతాన్ని కార్మికుడు భరించాల్సి ఉంటుందని నియమ నిబంధనలు చెబుతున్నాయి. ఇందుకనుగుణంగా ప్రభుత్వం ప్రతిపాద నలు కూడా సిద్ధం చేసింది. కానీ గత మూడున్నరేండ్ల నుంచి అవి అమలుకు నోచుకోలేదు. మరోవైపు కార్మికులందరికీ ఒకేసారి మరమగ్గాలను పంపిణీ చేయలేమంటూ ప్రభుత్వం ప్రకటించటంతో ఇప్పుడు నేతల్లో ఆందోళన నెలకొంది. ఏడాదికి 100 నుంచి 200 మందికి చొప్పున మగ్గాలను అందజేస్తామంటూ అధికారులు ప్రకటించారు. ఇందుకోసం లాటరీ పద్ధతిని అనుసరిస్తామని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో మొత్తం 60 వేల మంది కార్మికులకు ఎప్పుడు మగ్గాలిస్తారు? వారందరూ యజమానులుగా ఎప్పుడు మారతారు? అంటూ చేనేత నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
కార్మికులపై దృష్టి సారించాలి...
మంత్రి కేటీఆర్ గతంలో హామీనిచ్చినట్టుగా సిరిసిల్ల లోని నేత కార్మికులందరికీ ఒకేసారి మరమగ్గాలను అందజే యాలని ఈ సందర్భంగా తెలంగాణ చేనేత కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ప్రస్తుతమున్న మాస్టర్ వీవర్లకే మళ్లీ మగ్గాలను అందజేస్తే వారే బాగుపడతారు తప్పితే.. నిజమైన కార్మికుడికి ఒరిగేదేమీ ఉండబోదని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేశ్ చెప్పారు. అందువల్ల మగ్గాల పంపిణీ సందర్భంగా కార్మికులపై దృష్టి సారించి అవి వారికే అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.