Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి అడవుల్లో గొత్తికోయలపై అటవీ అధికారుల దాడి వెనుక కేసీఆర్, కేటీఆర్ కుట్ర దాగిఉన్నదని టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఆరోపించారు. సంఘటనపై మానవ హక్కుల కమిషన్తోపాటు జాతీయ గిరిజన హక్కుల కమిషన్కు కూడా ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. అడవుల్లో దాడికి గురైన బాధితులు బుధవారం టీడీపీ కార్యాలయానికి రాగా, వారిని టీటీడీపీ నాయకులు ఎల్.రమణ, రేవంత్రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గిరిజన జాతిని, సంస్కృతిని సమూలంగా తుడిచిపెట్టే యత్నం చేస్తున్నాడని విమర్శించారు. అటవీ ప్రాంతాల్లో వనరులను కొల్లగొట్టడం కోసమే ఈ తతంగమంతా అని తూర్పారబట్టారు. మహిళల బట్టలు లాగి, చెట్టుకు కట్టేసి కొట్టాల్సిన అవసరమేమోచ్చిందని మండిపడ్డారు. వారేమైన దోపిడీలు చేశారా ? కేసీఆర్ ఆస్తులు అడిగారా అని ప్రశ్నించారు. మియాపూర్ కుంభకోణం, డ్రగ్స్ వ్యవహారం, నేరెళ్లలో పోలీసుల రాక్షసత్వం, గొత్తికోయలపై దాడి, బతుకమ్మ చీరల భాగోతం ఇలా ఒకటొకటి వెలుగులోకి వస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ దాడికి గురైన బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ ప్రెసిడెంట్ ఎల్.రమణ హామీనిచ్చారు. బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు.