Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 47.26 శాతం సీట్లు ఖాళీ
- చేరేందుకు ఆసక్తి చూపని విద్యార్థులు
- కోర్టు కేసులో ఉన్న కాలేజీల్లోనూ మిగిలిన సీట్లు
- ఆన్లైన్లో ఉన్న కాలేజీల్లో సగానికిపైగా ఖాళీలే
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డిగ్రీ గురుకుల కాలేజీలకు అనుకున్నంత ఆదరణ లభించడం లేదు. విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపకపోవడంతో వెలవెలబోతున్నాయి. రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ గురుకులాల పరిధిలో 52 డిగ్రీ కాలేజీలున్నాయి. వాటిలో 15,360 సీట్లు అందుబాటులో ఉంటే, 8,101 (52.74 శాతం) మంది విద్యార్థులు చేరారు. ఇంకా 7,259 (47.26 శాతం) సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ గణాంకాలను బట్టి గురుకుల డిగ్రీ కాలేజీల్లోనూ సీట్లు మిగిలాయని అర్థమవుతున్నది. ఇందులో 30 ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 8,400 సీట్లుంటే, 5,506 (65.55 శాతం) సీట్లు మాత్రమే నిండాయి. వాటిలో 2,894 (34.45 శాతం) సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరంలోనే 21 గిరిజన గురుకుల డిగ్రీ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. వాటికి ఏ మాత్రం ఆదరణ లేదని స్పష్టతమవుతున్నది. 21 గిరిజన గురుకుల డిగ్రీ కాలేజీల్లో 6,720 సీట్లుండగా, కేవలం 2,410 (35.86 శాతం) మంది విద్యార్థులే చేరారు. వాటిలో 4,310 (64.14 శాతం) సీట్లు మిగలడం గమనార్హం. ఒక బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలో 240 సీట్లుంటే, 185 (77.08 శాతం) మంది చేరారు. ఇంకా 55 (22.92 శాతం) సీట్లు మిగిలాయి. గురుకుల డిగ్రీ కాలేజీల్లో ఆధునిక సౌకర్యాలు, ఉచిత వసతి, భోజన సదుపాయం, బట్టలు, పుస్తకాలు, నోట్పుస్తకాలు ఇవ్వడం, అర్హులైన అధ్యాపకులున్నా వాటిలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని పై గణాంకాలే చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఏ ఉద్దేశంతో వాటిని ప్రారంభించిందో అది నెరవేరని పరిస్థితి వచ్చింది. గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో సీట్లు దొరకడం అంత సులువు కాదు. ప్రతిభ ఉన్న వారికే సీట్లు దొరుకుతాయి. వాటిలో సీటు కావాలని ఇప్పటి కీ గురుకులాల అధికారుల చుట్టూ విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రదక్షిణలు చేస్తున్నాయి. వాటికి భిన్నంగా గురుకుల డిగ్రీ కాలేజీలున్నాయి. సీట్లు అందుబాటులో ఉన్నా చేరడానికి విద్యార్థులు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.
డిగ్రీ కాలేజీల్లో సగానికిపైగా ఖాళీలే...
డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ 2017-18 విద్యాసంవత్సరానికి సంబంధించి ముగిసింది. ఆన్లైన్లో, కోర్టు కేసుల ద్వారా ప్రవేశాలు చేపట్టిన కాలేజీలు, గురుకుల డిగ్రీ కాలేజీలు కలిపి రాష్ట్రంలో 1,186 ఉన్నాయి. వాటిలో 4,48,457 సీట్లున్నాయి. అందులో 2,23,427 (49.82 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 2,25,030 (50.18 శాతం) సీట్లు ఖాళీగానే ఉన్నాయి. అంటే ఈ విద్యాసంవత్సరంలో డిగ్రీ కాలేజీల్లో సగానికిపైగా సీట్లు మిగిలాయి. గత విద్యా సంవత్సరంలో 1,168 డిగ్రీ కాలేజీల్లో 3,82,449 సీట్లుంటే, 2,15,356 (56.31 శాతం) సీట్లు నిండాయి. గతేడాది 1,67,093 (43.69 శాతం) సీట్లు నిండాయి. గతేడాది కన్నా ఈ విద్యాసంవత్సరంలో డిగ్రీ కాలేజీల్లో 8,071 మంది విద్యార్థులు ఎక్కువగా చేరడం గమనార్హం. ఈ విద్యాసంవత్సరంలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియలో 1,092 కాలేజీల్లో 4,10,267 సీట్లుండగా, 1,95,555 (47.67 శాతం) మంది చేరారు. వాటిలో 2,14,712 (52.33 శాతం) సీట్లు మిగిలాయి. ఇక కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి పొంది సొంతంగా ప్రవేశాలు చేపట్టిన 42 డిగ్రీ కాలేజీల్లో 22,830 సీట్లున్నాయి. వాటిలో 19,771 (86.60 శాతం) సీట్లు భర్తీ చేయగా, 3,059 (13.40 శాతం) సీట్లు మిగిలాయి. కోర్టు నుంచి అనుమతి పొందిన కాలేజీల్లోనూ సీట్లు మిగలడం గమనార్హం.
మరింత సమర్థంగా పనిచేస్తాం : పాపిరెడ్డి
వచ్చే విద్యాసంవత్సరంలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా మరింత సమర్థంగా పనిచేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియలో వస్తున్న సమస్యలను పరిశీలించి మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని అన్నారు. విద్యార్థుల శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా మెరుగైన సేవలు అందిస్తామన్నారు. డిగ్రీ కాలేజీల్లో మరింత మంది విద్యార్థులు చేరేలా చూస్తామని అన్నారు.
డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీ వివరాలు
విద్యాసంవత్సరం కాలేజీలు మొత్తం సీట్లు భర్తీ మిగులు
2016-17 1168 382449 215356 167093
2017-18 1186 448457 223427 225030