Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సురక్షా భారత్ కోసమే యాత్ర
- భారత్యాత్రలో నోబెల్ గ్రహిత కైలాశ్ సత్యర్థి
- ఎంజే మార్కెట్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు ర్యాలీ
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
దేశంలోని బాలల రక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని నోబెల్ బహుమతి గ్రహిత కైలాశ్ సత్యర్థి తెలిపారు. పిల్లలు సురక్షితంగా ఉండేంత వరకూ తాను విశ్రమించబోనని చెప్పారు. బాలలపై లైంగికవేధింపులు, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఈనెల11న కన్యాకుమారిలోలో ప్రారంభమైన భారత్యాత్ర హైదరాబాద్ చేరుకున్నది. గురువారం ఎంజే మార్కెట్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకూ ర్యాలీ నిర్వహించారు. దీనిలో రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలు కె కేశవరావు, వినోద్కుమార్, విశ్వేశ్వర్రెడ్డి, సినీనటి అమల తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన బహిరంగసభలో కైలాశ్ సత్యర్థి మాట్లాడుతూ...బాలల హక్కుల పరిరక్షణ కోసం కుల, మతాలకు అతీతంగా కృషి చేయాలని కోరారు. దేశంలో బాలలపై దాడులు పెరుగుతున్నాయని, బడులు కూడా సురక్షితంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే యువత ఎక్కువగా తెలంగాణలో ఉందనీ, బాలికలపై జరిగే లైంగిక దాడుల నివారణకు వారంతా కృషి చేయాలని కోరారు. బాలలపై దాడులు, బాలకార్మికులు లేని దేశం కావాలని అన్నారు. 'మేక్ తెలంగాణ-సేఫ్ తెలంగాణ' నినాదంతో పోరాటానికి సిద్ధం కావాలన్నారు. దీనికోసం ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థలు, కార్పొరేట్, మత సంస్థలు ఐక్యంగా కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం బాలల రక్షణకు బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు బాలబాలికలపై జరుగుతున్న దాడులపై నిశబ్దాన్ని విడనాడాలని, భావాలను స్వేచ్ఛగా చెప్పాలని కోరారు. ఎంపీలు కె కేశవరావు, వినోద్కుమార్, విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ...సత్యార్థి భారత్యాత్రకు తెలంగాణ ప్రభుత్వం తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. పాఠ్యపుస్తకాల్లో లైంగిక దాడులకు సంబంధించిన అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని కోరారు. బాలల పరిరక్షణ కమిషన్ మాజీ చైర్పర్సన్ శాంతాసిన్హా, మతగురువులు హరికిషన్, విఠల్రావు, బీకే రజిని, ముజాహిద్ హుస్సేన్, అవినాశ్ సింగ్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సునితా కృష్ణన్, రమేశ్, ప్రకాశ్, రాముగౌడ్, లక్షి, ఇందిరా,రజినీకాంత్,వివేక్, రోజి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈనెల 11న ప్రారంభమైన యాత్ర 22 రాష్ట్రాల మీదుగా 11వేల కిలోమీటర్ల మేర కొనసాగనున్నది. అక్టోబర్ 16న ఢిల్లీలో యాత్ర ముగియనున్నది.
అసెంబ్లీ సందర్శన..:తెలంగాణ అసెంబ్లీని కైలాశ్ సత్యర్థి సందర్శించారు. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ మధుసుదనాచారి, మండలి చైర్మెన్ స్వామిగౌడ్, డిప్యూటీసీఎం కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కె తారకరామారావు, హారీశ్రావు, జగదీశ్రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.