Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీలోని తెలంగాణ ద్రోహులను తరిమికొట్టాలి: వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు
- అయూబ్ఖాన్ మృతి తీరని లోటు: నాయకులు
- బలిదానాలొద్దు బతికి సాధించుకుందాం
- 27న వికారాబాద్లో సంతాప సభ
నవతెలంగాణ-వికారాబాద్ రూరల్
ఉద్యమకారులకు టీఆర్ఎస్లో తగిన గుర్తింపు దక్కట్లేదని, పార్టీలోని తెలంగాణ ద్రోహులను తరిమికొట్టాలని అదే పార్టీకి చెందిన వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు అన్నారు. కొందరు తెలంగాణ ద్రోహులు పదవులను అనుభవిస్తున్నారని, వారి పెత్తనంతో ఉద్యమకారులు రాజకీయంగా ఎదగలేక మానసిక క్షోభతో బలిదానాలు చేసుకుంటున్నారని వాపోయారు. ఉద్యమకారులను విస్మరిస్తే భవిష్యత్లో పార్టీమనుగడ సాధించడం కష్టమని సీఎం కేసీఆర్కు హితవు పలికారు. ఆయూబ్ఖాన్ లాంటి ఉద్యమ కార్యకర్త మృతి టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఖాన్ సమాధిపై ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వికారాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..విద్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మెన్ నాగేందర్గౌడ్, తెలంగాణ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ, మహిళా శిశుసంక్షేమ అభివృద్ధి శాఖ చైర్పర్సన్ వీరమణి, సువర్ణరెడ్డి, శుభప్రద్పటేల్తో కలిసి సంజీవరావు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో రేయింబవళ్లు పాల్గొన్న కార్యకర్తల ఆర్థిక పరిస్థితి నేడు దయనీయంగా ఉందన్నారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు పదవులు పొందుతున్నారని, దీంతో వారికి అవకాశాలు లేకుండా పోయాయని వాపోయారు. ఉద్యమకారులకు కనీసం నామినేటేడ్ పదవులైనా దక్కట్లేదన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు ఆర్థికంగా బలపడి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందే సత్తా ఉందని, ఉద్యమకారులు ఆర్థికంగా లేని కారణంగా ఎన్నికల్లో పోటీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం కార్పొరేషన్ పదవులను ప్రజాప్రతినిధులకు ఇవ్వకుండా ఉద్యమకారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులతోనే తెలంగాణ పార్టీ ఆవిర్భావించిందని గుర్తుంచుకోవాలన్నారు. ఉద్యమద్రోహు లుగా పార్టీలో చలామణి అవుతున్న నాయకులను తరిమివేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యమనాయకుడు అయినందున వల్లే ఆయనపై విశ్వాసంతో పార్టీలో కొనసాగుతున్నామని చెప్పారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉద్యమ కారుల ఐక్యవేదిక ఏర్పాటుచేసి కార్యాచరణ అమలు చేస్తామన్నారు. ఉద్యమ కారుడు అయూబ్ఖాన్ కుటుంబానికి పార్టీ పరంగా రూ.10 లక్షలు, మంత్రి వ్యక్తిగతంగా రూ.20 లక్షలు ఇచ్చినా ఆయన లేని లోటును పూడ్చలేమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ కారుల తరఫున ఖాన్ కుటుంబానికి రూ.లక్ష నగదు అందజేశారు. ఈనెల 27న అయూబ్ ఖాన్ సంతాప సభను వికారాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అస్లాం, స్వప్న, ఎల్లారెడ్డి, మాణిక్యరెడ్డి, షఫి పాల్గొన్నారు.