Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ జేఏసీ చైర్మెన్, ప్రొఫెసర్ కోదండరామ్
నవతెలంగాణ - వనస్థలిపురం
హైదరాబాద్లోని కొత్తపేటలో గల విక్టోరియా మెమోరియల్ పాఠశాల భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు చట్ట వ్యతిరేకమని, అనాథ విద్యార్థుల భూమి జోలికొస్తే ఖబడ్దార్ అని రాజకీయ జేఏసీ చైర్మెన్, ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ జేఏసీ రంగారెడ్డి జిల్లా కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం వీఎమ్హోం భూముల పరిరక్షణ కోసం ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోదరడరామ్ మాట్లాడుతూ...నియంతగా పేరుగాంచిన నిజాం నవాబు అనాథలకు వీఎంహోంను అందిస్తే సీఎం కేసీఆర్ నిజాంను మించిన నియంతగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. అనాథ విద్యార్థుల కోసం సుమారు వదేండ్ల కింద వీఎంహోంను ఏర్పాటుచేసి 74 ఎకరాల భూమిని నిజాం సమకూర్చారన్నారు. ఈ భూమిలో రాచకొండ కమిషనరేట్కు భూమిని కేటాయించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వందేండ్ల నాటి వీలునామాలో ఈ భూమిపై ప్రభుత్వానికి, వ్యక్తికి, వ్యక్తులకు ఎలాంటి హక్కు లేదని స్పష్టంగా ఉన్నా ఇతర విభాగాలకు భూమిని కేటాయిస్తున్నట్టు జీవోలు విడుదల చేయడం సరైంది కాదన్నారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో తెలంగాణ పాలకులే తెలంగాణ చరిత్రకు నిలువుటద్దంగా ఉన్న వీఎంహోంను తుడిచిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే అన్యాక్రాంతమైన భూమి విషయంలో ప్రభుత్వం స్పందించి మిగిలిన భూమి విషయంలో సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. భూమి సేకరణ కోసం విడుదల చేసిన 48, 50 జీవోలను రద్దుచేసి ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సులు చదువుకునే వీలుండే హాస్టల్ వసతి కలిగిన కళాశాలలు ఏర్పాటుచేసి చిత్తశుద్ధి చాటుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సీపీఐ(ఎం) నాయకులు చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అనాథ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ భూమి విషయంలో ఇప్పటికే శాంతియుత పోరాటం మొదలైందని, అన్ని సంఘాలను, ప్రజలను కూడగట్టి పోరాటం ఉధృతం చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా మంగల్పల్లి గ్రామపంచాయతీ పరిధిలో 362 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఆ స్థలం రాచకొండ పోలీస్ కమిషనరేట్కు చాలా అనువైందని వివిధ సంఘాల నాయకులు ప్రభుత్వానికి సూచించారు.