Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సైదాపూర్
అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఘన్పూర్లో ఆదివారం జరిగింది. గ్రామస్తులు, బంధువుల వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలం ఘన్పూర్కి చెందిన దాసరి విజయ (47) భర్త లింగారెడ్డి పదేండ్ల కింద చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె తన మూడెకరాలను సాగుచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది. వరుసగా మూడేండ్లుగా పెట్టుబడులే తప్ప ఆశించిన పంట దిగుబడులు రాలేదు. ఆ కుటుంబానికి సుమారు రూ.5 లక్షల వరకు అప్పుంది. ఓ వైపు పంటలు సరిగా పండకపోవడం, మరోవైపు అప్పులు ఏటేటా పెరిగిపోతుండటంతో ఆమె మనస్థాపానికి గురైంది. ఈ క్రమంంలోనే తన వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని పోలీసులు వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వాస్పత్రి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సైదాపూర్ ఎస్ఐ నూతి శ్రీధర్ తెలిపారు.