Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ ప్రభుత్వం: వేముల వెంకటేష్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ ప్రభుత్వం వడ్డెరుల సంక్షేమాన్ని విస్మరిస్తోందని వడ్డెర సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు వేముల వెంకటేష్ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వ మూడున్నరేండ్ల పాలనలో వడ్డెరలకు ఒరిగిందేమీలేదన్నారు. ఫెడరేషన్లు మూసివేసే దిశగా ప్రయత్నం జరుగుతోందన్నారు. రజక, నాయి బ్రాహ్మణ ఫెడరేషన్లకు రూ 500 కోట్లు కేటాయించినా ఇప్పటి వరకు ఒక పైసా విడుదల చేయలేదని విమర్శించారు. శతాబ్దాలుగా సమాజ సేవ చేస్తున్న వడ్డెర్లు బంగారు తెలంగాణలో రోడ్లపాలయ్యారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4800 సొసైటీలు ఉన్న వడ్డెర్లకు అప్పటి ప్రభుత్వం ఏటా రూ 18 కోట్లు కేటాయించి సామాజిక అభివృద్ధికి దోహదం చేసిందని చెప్పారు. వడ్డెర్లకు కేసీఆర్ ప్రభుత్వం నయాపైసా విడుదల చేయకుండా వారి అభ్యున్నతిని అడ్డుకుంటుందన్నారు. బ్రాహ్మణ, రెడ్డి సామాజికవర్గాలను చూసి టీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతోందని, అందుకే వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారులు అగ్రవర్ణాలు వారే అధికంగా ఉన్నారని, అందుకే బ్రాహ్మణ సంక్షేమానికి వందకోట్లు, రెడ్డి సంక్షేమ భవన్కు 15 ఎకరాల స్థలం కోట్ల రూపాయల నిధులు కేటాయించారని ఆరోపించారు. హయత్నగర్ మండలం బండరావిరాలలో అప్పటి ప్రభుత్వం మైనింగ్ కోసం 66 ఎకరాలు కేటాయించిందని గుర్తు చేశారు. మైనింగ్ జీవో 145 అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రధానికి లేఖ రాసినా నేడు అదే విషయాన్ని విస్మరించారని చెప్పారు. వడ్డెర్లు తమ న్యాయమైన హక్కుల కోసం ఉద్యమిస్తామని ఆయన చెప్పారు.