Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సదారాం, బుద్ధా మురళికి ఉన్న ప్రాతిపదిక ఏమిటి?
- ఫిర్యాదులు, అప్పీళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి
- ఆన్లైన్లో దరఖాస్తులకు అనుమతించాలి: పీఎఫ్ఐ రౌండ్టేబుల్ సమావేశంలో వక్తలు నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమాచార కమిషనర్ల నియామకంలో పూర్తి పారదర్శకతను పాటించాలని పీపుల్స్ ఫోరం ఫర్ ఇన్ఫర్మేషన్ (పీఎఫ్ఐ) డిమాండ్ చేసింది. నూతన రాష్ట్రమైన తెలంగాణ అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధిని సాధించాలంటే కమిషన్ క్రియాశీలకంగా పని చేయాలని సూచించింది. ఇందులో భాగంగా స్పష్టమైన, పక్కా సమాచారాన్ని ప్రజలకు అందిం చాలని కోరింది. తద్వారా వివిధ రంగాల్లో దోపిడీ, అవినీతి, ఆశ్రితపక్షపాతం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది.
'సమాచార కమిషనర్ల నియామకం' అనే అంశంపై ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పీఎఫ్ఐ ఆధ్వర్యాన రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆ ఫోరం అధ్యక్షులు వి.యాదయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నేషనల్ క్యాంపెయిన్ ఫర్ పీపుల్స్ రైట్ టూ ఇన్ఫర్మేషన్ (ఎన్సీపీఆర్ఐ) కో కన్వీనర్ డి.రాకేశ్రెడ్డి ముఖ్య వక్తగా మాట్లాడుతూ.. తెలంగాణ సమాచార కమిషనర్ల నియామకంపై మేధావులు, న్యాయ నిపుణులు పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వారి నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై గతంలో సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. 2013లో అదే సుప్రీంకోర్టు తన తీర్పును వెనక్కు తీసుకుందని చెప్పారు. ఇదే సమయంలో నియామక ప్రక్రియలో పూర్తి పారద్శకతను పాటించాలంటూ సూచించిందని వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కమిషనర్గా రాజా సదారాంను, కమిషనర్గా బుద్దా మురళిని నియమించటానికిగల ప్రాతిపదికలేమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో 31 జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో.. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)కి సంబంధించి ఇప్పటి వరకూ ఎన్ని ఫిర్యాదులు అందాయి? ఎంతమంది అప్పీళ్లకు వెళ్లారు? వీటిలో ఎన్నింటిని పరిష్కరించారు? ఎన్ని పెండింగ్లో ఉన్నాయి? అనే అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్టీఐ కార్యకర్త ఎమ్.మహేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోయి మూడున్నరేండ్లు దాటింది.. అయినా సమాచార కమిషన్తోపాటు ఆర్టీఐ వెబ్సైట్లలో ఆంధ్రప్రదేశ్ పేరే దర్శనమిస్తున్నదని విమర్శించారు. ఇది అత్యంత సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో వెబ్సైట్లను తక్షణం తాజా పరచాలని, తక్షణ సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. పీఎఫ్ఐ కార్యదర్శి కె.పార్థసారధి మాట్లాడుతూ.. ఆర్టీఐ కింద ఏదేనీ సమాచారం పొందాలంటే ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థల ఆఫీసుల వద్దకే నేరుగా వెళ్లాల్సి వస్తున్నదని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో సమాచారం కోసం ఆన్లైన్లో సైతం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమాచార కమిషన్ పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు జిల్లాల్లో కూడా ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. పీఎఫ్ఐ సంయుక్త కార్యదర్శి మహ్మద్ సాధిక్ అలీ మాట్లాడుతూ.. పోరాటాల ద్వారానే సమాచార హక్కు చట్టాన్ని కాపాడుకోగలమని అన్నారు. నియామకాలపై ఉన్న సందేహాలపై కమిషన్కు వినతిపత్రం ఇద్దాం.. స్పందించకపోతే ధర్నా చేద్దాం.. అప్పటికీ వినకపోతే కమిషన్ కార్యాలయాన్ని ముట్టడిద్దామని సూచించారు. కార్యక్రమంలో పీఎఫ్ఐ నాయకులు భగవంత్రెడ్డి, బాలచందర్, సిరాజుద్దీన్ ఖురేషీ, కెఎస్ఎన్ మూర్తి, కార్యకర్తలు గౌస్, మహ్మద్ ఖాన్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. వచ్చేనెల 14, 15 తేదీల్లో భువనేశ్వర్లో ఎన్సీపీఆర్ఐ జాతీయ సదస్సు జరుగనుందని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను అషజూతీఱ.ఱఅసఱaఏస్త్రఎaఱశ్రీ.షశీఎ వెబ్సైట్లో పొందుపరిచామని చెప్పారు.