Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ను హిందూ రిపబ్లిక్ దేశంగా ప్రకటించాలి
- ఇద్దరు పిల్లలకు మించితే 'సంక్షేమం' కట్
- అన్నింటా హిందూవాదమే ప్రతిబింబించాలి: వీహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షులు ప్రవీణ్ తొగాడియా
నవతెలంగాణ-ఖమ్మం ప్రతినిధి
భారత రాజ్యాంగం నుంచి లౌకిక, సామ్యవాద పదాలను తొలగించి హిందూ పదాన్ని జోడించాలని, భారత్ను హిందూ రిపబ్లిక్ దేశంగా మార్చాలని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు ప్రవీణ్తొగాడియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రతి ఒక్కరూ ఇద్దరు పిల్లలనే కనాలని, అంతకు మించి కంటే ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా చేసేలా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. విశ్వహిందూ పరిషత్ ఖమ్మం జిల్లా అభ్యాస వర్గ సమావేశం ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూవులు ఎక్కువగా ఉన్నప్పటికీ భారత్లో హిందూ ప్రభుత్వం లేదన్నారు. అలా కాకుండా దేశంలో అన్నింటా హిందూ వాదమే ప్రతిబింబించాలన్నారు. ప్రధాని, కేంద్రమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, రాష్ట్రమంత్రి, గవర్నర్, జడ్జి, కలెక్టర్, సైనికులు, ఎస్పీ, ఎస్ఐ, పోలీసులు, ఇలా అందరూ హిందూవులే ఉండాలన్నారు. దేశంలో జనాభా నియంత్రణలో ఉంటే ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. దేశంలో హిందూ మతానికి చెందిన వారు అధికారంలో ఉంటేనే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. దేశరక్షణ పటిష్టంగా ఉండాలంటే హిందూవాదమే శరణ్యమన్నారు. హిందూ మతం ఏ మతానికీ శత్రువు కాదనీ, తమ మతాన్ని కించపరిచే విధంగా ఎవరు వ్యాఖ్యానించినా సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత కార్యదర్శి మాధవరెడ్డి గాల్రెడ్డి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యక్షులు సునితారాం మోహన్రెడ్డి, క్షేత్ర సేవా ప్రముఖ్ హనుమంతరావు, సహాయకార్యదర్శి పుల్లా సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.