Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ నడకతోనే కేసీఆర్ నోట అణగారిన వర్గాల మాట
- యాత్ర లక్ష్యాలు ఒకట్రెండు రోజుల్లో నెరవేరేవి కావు
- టీ మాస్ ఏర్పాటనేది మేం వేసిన పెద్ద ముందడుగు
- వచ్చే ఏడాది ఆరంభంలో రాజకీయ ఫ్రంట్ : తమ్మినేని
- 'నవతెలంగాణ'తో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
మహాజన పాదయాత్రతో పాలకుల కండ్లు తెరిపించి అప్పుడే ఏడాదయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక..సామాజిక న్యాయం.. సమగ్రాభివృద్ధి నినాదంతో తొలి అడుగులు పడ్డాయి. తొమ్మిది మంది సభ్యుల బృందం కాలినడకన పయనమైతే..అధికారపక్షంలో గుబులు రేగింది. ఎలాంటి బెదిరింపులకు వెరవక... పగలనక,రాత్రనక నడకసాగించి.. పాదయాత్ర ఓ మైలురాయిగా నిలిచింది. సీఎం కేసీఆర్ కూడా అణగారిన వర్గాల గురించి వల్లెవేశారు. దీర్ఘకాల పోరాటాలతోనే లక్ష్యాలు సాధ్యమవుతాయని సీపీఐ(ఎం) రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అంటున్నారు.
* బి.వి.యన్.పద్మరాజు
సామాజిక న్యాయం-రాష్ట్ర సమగ్రాభివృద్ధి అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా తాము సాగించిన మహాజన పాదయాత్ర దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిందని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి, పాదయాత్ర సారధి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. ఆ యాత్ర గతేడాది రాష్ట్ర బడ్జెట్పై పెద్ద ప్రభావాన్నే చూపిందని అన్నారు. ఫలితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి తొలిసారిగా అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీలనే మాటలు వినబడ్డాయని తెలిపారు. అయితే ఆయన హామీలు, ప్రకటనలు కేవలం మాటలుగానే మిగిలాయి తప్ప ఆచరణలో కార్యరూపం దాల్చలేదని చెప్పారు. సామాజిక న్యాయం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి అనే లక్ష్యాలు కేవలం ఒకట్రెండు రోజుల్లో నెరవేరేవి కావని తెలిపారు. వాటిని సాధించేందుకు దీర్ఘకాలం పడుతుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తెలంగాణ సామాజిక, ప్రజా సంఘాల ఐక్య వేదిక (టీ మాస్)ను ఏర్పాటు చేయటమనేది.. పాదయాత్ర కొనసాగింపుగా తాము సాధించిన గొప్ప విజయం, వేసిన పెద్ద ముందడుగని చెప్పారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లకు కారణమైన సరళీకృత ఆర్థిక విధానాలను వ్యతిరేకించే పార్టీలు, శక్తులు, సంఘాలతో వచ్చే ఏడాది ఆరంభంలో రాజకీయ ఫ్రంట్ను ఏర్పాటు చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మహాజన పాదయాత్ర ప్రారంభమై ఏడాది (మంగళవారం-అక్టోబరు 17 నాటికి) పూర్తయిన సందర్భంగా తమ్మినేని.. నవతెలంగాణతో పలు అంశాలపై ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు...
పాదయాత్ర లక్ష్యాలు ఎంతవరకు నెరవేరాయి..?
''వాటిని సాధించటమనేది ఒక దీర్ఘకాలం పట్టే ప్రక్రియ. సమాజంలో ఉన్న తరగతులన్నింటికీ న్యాయం జరగటం, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా వారి హక్కుల్ని, ప్రాతినిధ్యం సాధించటం.. వ్యవసాయం, విద్య, వైద్యం, సాగునీళ్లు, తాగునీళ్లలో సమగ్రాభివృద్ధిని సాధించటమనేది కూడా ఒక దీర్ఘకాలిక ప్రక్రియ. కాకపోతే ఈ ఏడాది కాలంగా ప్రభుత్వం ఆ దిశగా ఏమైనా చేసిందా? ఆ దిశగా ప్రజా చైతన్యంతో ఉద్యమాలు జరిగాయా? అన్నది పరిశీలించి నప్పుడు.. ప్రభుత్వం మా యాత్రకు స్పందించి అట్టడుగు వర్గాలకు, తరగతు లకు కొన్ని వరాలు ప్రకటించింది. కానీ అవి మాటల్లో తప్ప చేతల్లో అమలుకు నోచుకోలేదు. సమగ్ర విధానం.. సామాజిక న్యాయం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. కానీ ప్రజా ఉద్యమాల విషయంలో ఒక పెద్ద కృషి జరిగింది.. జరుగుతున్నది. పాదయాత్ర తర్వాత టీ మాస్ అనే సంస్థ ఏర్పడటం అనేది ఈ దిశలో మేం వేసిన పెద్ద ముందడుగు...''
పాదయాత్ర సందర్భంగా మీరు అనేకాంశాలపై ముఖ్యమంత్రికి లేఖలు రాశారు కదా..? వాటికి ఫలితాలు వచ్చాయా..?
''సీఎం.. మేం రాసిన ప్రతి లేఖపైనా స్పందించారు. అధికారులను సమావేశపరిచారు. కాకపోతే మా లెటరుకు స్పందించినట్టుగా మీడియాకు చెప్పటం లేదా మాకు ప్రత్యుత్తరమివ్వటం కాకుండా క్షేత్రస్థాయిలో ఈ సమస్య నానుతోంది కాబట్టి.. ప్రజల్లో చర్చ జరుగుతోంది కాబట్టి అది రాజకీయంగా తమకు నష్టం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకునే క్రమంలో ఎప్పటికప్పుడు స్పందించిన తీరు కనబడింది. తద్వారా గత బడ్జెట్ మీద పాదయాత్ర పెద్ద ప్రభావాన్ని చూపింది. దానివల్లే సీఎం వివిధ వర్గాలు, తరగతులు, కులాల ప్రజలకు అనేక వరాలు ఇవ్వాల్సి వచ్చింది. అయితే వాటన్నింటినీ సక్రమంగా అమలు జరపలేదు. ప్రజలు ఆశించిన ప్రయోజనం నెరవేరలేదన్నది వాస్తవం. కానీ పాదయాత్ర వల్లే ప్రభుత్వంలో ఆ కదలిక వచ్చిందనేది మరిచిపోలేని సత్యం...''
పాదయాత్ర తర్వాత సామాజిక శక్తులు, సంఘాలు మీతో ఎంతవరకూ కలిసొస్తున్నాయి..?
''అన్ని సంఘాలు, సామాజిక తరగతుల్లో కూడా తమ హక్కుల కోసం పోరాడాలనే ఒక దృష్టి ఉంది. కాకపోతే ఐక్యం చేసే శక్తి లేక ఇప్పటి వరకూ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు తప్పనిసరిగా ఆ దిశగా ముందుకు పోయే అవకాశం ఉంది.
ఈ విషయంలో ఇతర వామపక్షాల పరిస్థితేమిటి..?
''వామపక్షాల ఐక్య కార్యచరణ నడుస్తూనే ఉంది. గతంలో ఎలాగైతే సమస్యల ఆధారంగా ప్రజా ఉద్యమాలను నడిపామో ఇప్పుడు కూడా అదే కృషి కొనసాగుతున్నది. ధర్నాచౌక్, రైతాంగ ఉద్యమాలతోపాటు ఇంకా అనేక సమస్యలపై వామపక్షాలు ఎప్పటికప్పుడు చర్చించుకుని ఐక్య కార్యాచరణను కొనసాగిస్తున్నాయి. అయితే టీ మాస్లోకి అన్ని వామపక్షాలు, వాటి ప్రజా సంఘాలు ఇంకా రాలేదు. కొన్ని వామపక్షాలు ఇందులో పాల్గొంటున్నాయి. మరికొన్ని వామపక్షాలు, వారి ప్రజా సంఘాలు ఇటీవల పాల్గొనటానికి నిర్ణయం తీసుకున్నాయి. అఖిల భారత స్థాయిలో వామపక్షాల వెనుకాల ఉన్న ప్రజా సంఘాలతో ఐక్య కమిటీ ఏర్పడ్డాక ఇటీవల సీపీఐ కూడా ఆలోచన చేస్తున్నది. త్వరలోనే వారికి సంబంధించిన ప్రజా సంఘాలు కూడా టీ మాస్లో పనిచేసే అవకాశం ఉంది...''
టీ మాస్ ఇప్పటివరకూ రాష్ట్ర, జిల్లా ఫోరాలనే ఏర్పాటు చేసింది. ఆ ప్రక్రియలో తలమునకలైంది. జనం దగ్గరికి ఇంకా పోలేదనే అభిప్రాయం ఉంది. అలాంటప్పుడు వారిని కదిలించకపోతే దాని ఉద్యమాలు జయప్రదం కావుగదా..?
''ఇది సరైంది. ప్రజల్లోకి వెళ్లకుండా ఉద్యమాలు విజయవంతం కావటం అసాధ్యం.. ఇప్పుడు టీ మాస్ నిర్మాణ దశలో తప్ప ఉద్యమాల దశలో లేదు. ఇప్పటిదాకా రాష్ట్ర ఆవిర్భావ, జిల్లా ఆవిర్భావ సభలు జరిగాయి. ఇటీవల జరిగిన టీ మాస్ జనరల్ బాడీ సమావేశంలో గ్రామ, మండల స్థాయికి ఈ వేదికను తీసుకెళ్లాలని నిర్ణయించాం. ఈ ప్రక్రియ పూర్తయ్యాక పెద్ద ఎత్తున జనంలోకి వెళతాం. జనవరి నెలంతా టీ మాస్ కోర్కెల పత్రంపై మిలిటెంట్ పోరాటాలు నిర్వహిస్తాం...''
టీ మాస్లో ప్రస్తుతం అనేక మంది కలిసొస్తున్నారు. కానీ ఎన్నికలు దగ్గరపడేకొద్దీ వీరిలో చాలా మంది దూరం అవుతారనే అభిప్రాయాలు వినబడుతు న్నాయి.. దీనిపై మీ అంచనా ఏమిటి...?
''టీ మాస్ అనేది ఒక రాజకీయ ఏకాభిప్రాయంతో ఏర్పడిన సంస్థ కాదు.. కాబట్టి రాజకీయాలు, ఎన్నికలు ముందుకొచ్చినప్పుడు కొంతమంది వాళ్లు.. వాళ్లు అభిమానించే పార్టీలవైపు వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకనే ఎన్నికల సమయం కంటే ముందే రాజకీయంగా కూడా ఏకాభిప్రాయంతో ఉండే వారందరితో కలిసి ఒక రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాం. ప్రస్తుత ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకృత ఆర్థిక విధానాలు కాకుండా, అలాంటి విధానాలను వ్యతిరేకించే రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు, శక్తులతో కలిసి ఒక రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనేది మా ఆలోచన. వచ్చే ఏడాది ఆరంభంలో ఇది ఏర్పడుతుందనేది మా అంచనా. దానికోసం ప్రయత్నిస్తున్నాం. అది ఏర్పడితే కేసీఆర్ రాజకీయ అధికారాన్నే సవాల్ చేయొచ్చు...''