Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు మృతి..పలువురికి అస్వస్థత
- 198 మంది రోగుల తరలింపు.. హన్మకొండ దవాఖానాలో ఘటన
- విచారణకు డిప్యూటీ సీఎం కడియం ఆదేశం
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ నగరంలోని హన్మకొండలో గల రోహిణి ఆస్పత్రిలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. 198 మంది రోగులను నగరంలోని ఇతర ఆస్పత్రులకు వేగంగా తరలించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వరంగల్ పోలీసు కమిషనర్ జి. సుధీర్బాబు, కలెక్టర్ అమ్రపాలి ఘటనాస్థలికి చేరుకుని రోగుల పరిస్థితిపై ఆరాతీశారు. ఈ ఘటనపై విచారణకు డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ ఘటనలో ఆపరేషన్ థియేటర్లో సర్జరీ చేయించుకుంటున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెంకట్రావుపల్లికి చెందిన జెట్టి కుమారస్వామి (45) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి ముగ్గురు ఆడపిల్లలున్నారు. మూడ్రోజుల కిందనే కుమారస్వామి ఆపరేషన్ నిమిత్తం ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. అదే జిల్లాకు చెందిన కాటారం మండలం దేవరాంపల్లికి చెందిన మల్లమ్మ (70) ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పరిస్థితి విషమించి చనిపోయింది.
ప్రమాదం ఎలా జరిగిందంటే...
ఆస్పత్రిలోని రెండో అంతస్తులో గల ఆపరేషన్ థియేటర్లో వైద్యులు సర్జరీ చేస్తుండగా ఆక్సిజన్ గ్యాస్ లీకై షార్ట్సర్క్యూట్తో మంటలు లేచాయి. ఆ ఫ్లోర్ మొత్తం దట్టమైన పొగలు వ్యాపించాయి. మూడో అంతస్తుకూ విస్తరించాయి. డాక్టర్లు, పలువురు పేషంట్లు, అటెండెంట్లు కిందకు పరిగెత్తుకొచ్చారు. రెండో అంతస్తులోని న్యూరో వార్డు, ట్రామా సెంటర్లో ఉన్న జూనియర్ డాక్టర్లు సకాలంలో స్పందించి రోగులను కిందకు తరలించారు. దీంతో ఆ రెండు వార్డుల్లో ఉన్న సుమారు 35-40 మంది రోగుల ప్రాణాలు కాపాడగలిగారు. హన్మకొండ ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను నియంత్రించారు. 40 నిమిషాల్లో మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్సిబ్బంది, సుబేదారి, హన్మకొండ పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది చాకచక్యంగా రోగులను ఆస్పత్రి నుంచి బయటకు తీసుకొచ్చారు. సకాలంలో స్పందించి చాలామంది రోగుల ప్రాణాలను కాపాడగలిగారు. 198 మంది రోగులను 32 అంబులెన్స్ల ద్వారా ఇతర ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రి ప్రధాన కూడలి ఉండటంతో రోగుల తరలించే క్రమంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అధికారులంతా సమన్వయంతో వేగంగా స్పందించారు. రోగులను కాపాడటంలోనూ, ఇతర ఆస్పత్రులకు తరలించడంలోనూ చురుకైన పాత్ర పోషించిన పోలీసులను, ఇతర శాఖల సిబ్బందిని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అభినందించారు. రోగులను సురక్షితంగా తరలించాలని, ప్రభుత్వ ఖర్చులతో వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. రోగులకు అసౌకర్యం కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
విచారణకు కమిటీ నియామకం
అగ్నిప్రమాదం ఘటనపై విచారణకు కమిటీని నియమించారు. ఈ కమిటీలో డీసీపీ వేణుగోపాలరావు, హన్మకొండ ఏసీపీ మురళీధర్, డివిజనల్ ఫైర్ ఆఫీసర్ కేశవులు, సుబేదారి సీఐ శ్రీనివాస్, ఫైర్ ఆఫీసర్ ఎ శ్రీనివాస్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఘటనాస్థలిని సందర్శించనుంది. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించాక ఒక నిర్ణయానికి రానున్నారు.