Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్టం లేకుండా.. సీడ్బౌల్ సాధ్యమా?
- కంపెనీలు ఎగ్గొడితే రైతులు దివాలా
- విత్తనోత్పత్తి నమోదు చేయని వ్యవసాయ శాఖ
విత్తన చట్టం చేయకుండానే రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా ఎలా మారుస్తారు అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని చెబుతోంది. విత్తనోత్పత్తిలో తెలంగాణకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇప్పుడు ప్రభుత్వం చేయబోయే విత్తన భాండాగారమేమిటీ అనే చర్చ జరుగుతోంది.
తెలంగాణ సమశీతోష్ణస్థితి ప్రాంతం. తెలంగాణలో ఉత్పత్తి అయిన ఏ విత్తనాలైనా, ఏ ప్రాంతంలోనైనా మొలకెత్తగలవు. ఇతర ప్రాంతాల విత్తనాలు మాత్రం ఆయా ప్రాంతాలకు మాత్రమే అనువైనవి, అక్కడే మొలకెత్తుతాయి. మహబూబ్నగర్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్, గద్వాల వంటి జిల్లాల నుంచి దేశ అవసరాలకు 60 శాతం విత్తతోత్పత్తి అవుతోంది. ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, ఎర్రజొన్నలు, కూరగాయల విత్తనోత్పత్తి పెద్ద ఎత్తున అవుతుంది. ఇప్పుడు అవుతున్న విత్తనోత్పత్తిని ప్రభుత్వ ఖాతాలో వేసుకునేందుకు తెలంగాణను విత్తన భాండాగారం చేస్తామని సీఎం కేసీఆర్ చెబుతున్నారని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు.
* మోత్కూరి యాదయ్య
విత్తన చట్టం అనేది ఆయా రాష్ట్రాల పరిధిలోని అంశమని ఒక పక్క రాజ్యాంగంలోనే పేర్కొంది. కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. విత్తన చట్టం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమైతే, ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విత్తన చట్టానికి సంబంధించిన ముసాయిదాను వ్యవసాయ శాఖ ఎందుకు రూపొందించినట్టు? రైతు సంఘాలతో రౌండ్టేబుల్ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినట్టు? అసెంబ్లీలో ఆమోదానికి ఎందుకు ప్రవేశపెట్టినట్టు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే విత్తన చట్టం చేస్తుందనే విషయం కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందిన వెంటనే, తామే విత్తన చట్టం చేస్తున్నామని, తక్షణమే ఉపసంహరించుకోవాలని లేఖ రాసిన సందర్భం ఉంది. మోన్శాంటో, డూప్పాయింట్, కార్గిల్, సిన్జెంటా వంటి బహుళజాతి కంపెనీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి విత్తన చట్టం ఏర్పాటు కాకుండా అడ్డుకున్నాయని సమాచారం. రాజస్థాన్ ప్రభుత్వం కూడా అక్కడి రైతులకు విత్తనోత్పత్తిలో రాయల్టీ లేకుండా స్వేచ్చనిచ్చింది. ఈ బహుళజాతి సంస్థలే బలవంతంగా రాయల్టీని వసూలు చేస్తున్న సంఘటలున్నాయి. పేటెంట్ హక్కు పేరుతో 2000 సంవత్సరం నుంచి రూ. 4వేల కోట్లు కాజేసాయి.. తెలంగాణ ప్రభుత్వానికి విత్తనోత్పత్తి, రైతులు మీద చిత్తశుద్ధి ఉంటే ఇప్పటిదాకా విత్తన చట్టం ఎందుకు అమలు చేయలేదని రైతు సంఘాలు ప్రశ్నించాయి. 1966లో దిగుమతుల కోసం చేసిన చట్టమే ఇప్పటికీ అమల్లో ఉంది.
విత్తన ధ్రువీకరణ కమిటీ పున:రుద్ధరించలేని వైనం
విత్తన ధ్రువీకరణ కమిటీని కూడా ప్రభుత్వం పునరుద్దరిం చలేకపోతోంది. ఉమ్మడి ఏపీలో విత్తన ధ్రువీకరణ సంస్థను రద్దు చేశారు. దీంతో విత్తన కంపెనీలే సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటు న్నాయి. ఈ నేపథ్యంలో విత్తన క్వాలిటీ లేకుండా పోతుంది. విత్తనోత్పత్తి రైతుల నుంచి సేకరించిన విత్తనం అయి పోయిన వెంటనే, సదరు కంపెనీలు పంట విత్తనాలే నాణ్యమైన విత్తనా లని చెబుతూ రైతులు విక్రయిస్తున్నాయి. నాణ్యత లేని విత్తనాల వల్ల ప్రతి ఏటా 4 లక్షల నుంచి 6 లక్షల ఎకరాల్లో రైతులు నష్టపోతున్నారు. బహుళ జాతి సంస్థలతో విత్తన కంపె నీలు మిలాఖత్ అవుతున్నాయి. మోన్శాంటో కంపెనీ బేయర్ సంస్థ కొనుగోలు చేసిన విషయం విదితమే. పంట నష్టం జరి గిన రైతుల కు పరిహారం లేదు. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతున్నది.
నాసిరకం విత్తన కంపెనీలపై చర్యలేవీ?
ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి నెలరోజుల ముందు నుంచే నకిలీ విత్తనాల జోరు ఉపందుకుంది. కార్పొరేట్ కంపెనీలకు చెందిన విత్తన కవర్లలో నాసిరకం విత్తనాలు ప్యాకేజీ చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న ముఠాను రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఇటీవలే అరెస్టు చేశారు. నాసిరకం విత్తనోత్పత్తి చేసే కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందనే విమర్శలున్నాయి. హైదరాబాద్ నగరం కేంద్రంగా శంషాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి, వరంగల్, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో కోట్ల రూపాయల విలువగల నకిలీ విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయి. విత్తన కంపెనీలు, ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై డీలర్లు, గుమస్తాలపై నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. పీడీ యాక్టు కింద నకిలీ, కల్తీ నేరగాళ్లను జైలుకు పంపుతామని ప్రభుత్వం ప్రకటించింది. కాని పట్టుబడిని వారిపై చర్యలు తీసుకోలేదు, జైలుకు పంపించిన దాఖలాల్లేవు. రాష్ట్రంలో నందిని, ఆదినందిని, మహానంది, ద్వారకా, హవా2020, కావేరిజాదు వంటి కవర్లను కొనుగోలు చేసి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారు. విత్తనోత్పత్తిదారుల నుంచి కంపెనీలు విత్తనాలు సేకరించేటప్పుడు నాణ్యతాలోపం ఉన్నదనే నెపం వేస్తున్నాయి. కంపెనీలు నిర్ణయించిన ధరకే విత్తనాలను విక్రయించాలి. కాంట్రాక్టు మార్కెటింగ్ చట్టం73 ప్రకారం రైతుల నుంచి ఒప్పందం చేసుకోవాలి. కంపెనీలు, ఉత్పత్తిదారుల మధ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 30న జీవో 133 జారీ చేసింది. కానీ ఎక్కడా అమలుకావడం లేదు. విత్తనాలు సేకరించి, రైతులకు విక్రయించిన తర్వాత ఉత్పత్తిదారులకు డబ్బులు చెల్లిస్తున్నారు. కంపెనీలు ఎగ్గొడితే రైతులు దివాళా తీయాల్సిందే.
మాట తప్పిన సర్కార్
నకిలీ విత్తనాలను అరికట్టి, నాణ్యమైన విత్తనాలు అందించేందుకు మండలానికొక విత్తన కంపెనీని బాధ్యులుగా పెడతామని ప్రభుత్వం చెప్పి మూడేండ్లయింది. ఇప్పటి వరకు మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వం విత్తన భాండాగారంపై ఊకదంపుడు ఉపన్యాలు ఇస్తుందనే విమర్శలున్నాయి. పంటల బీమా, వడ్డీలేని రుణాలు, శాస్త్రవేత్తల సలహాలు ఇప్పించకుండా, విత్తనోత్పత్తి రైతులకు రక్షణ కల్పించకుండా విత్తన భాండాగారం ఎలా సాధ్యమని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. విత్తనోత్పత్తి రైతులు కంపెనీల నుండి చట్టపరమైన రక్షణ కల్పించగలిగి, కంపెనీలు నాణ్యత లేని విత్తనాలు సరఫరా చేయకుండా అరికడితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. విత్తనోత్పత్తిదారులు కంపెనీలతో ఒప్పందం చేసుకొని ఉత్పత్తి చేయాల్సి ఉంది. కానీ ఈ ఒప్పందాన్ని వ్యవసాయ శాఖ నమోదు చేయడం లేదు. విత్తనాలు సరఫరా చేయడం తప్పా, కంపెనీల నుంచి ఉత్పత్తిదారులకు ఈసమెత్తు సహకారం అందడం లేదని వాపోతున్నారు. పైగా కంపెనీలు నాణ్యతలేని విత్తనాలు సరఫరా చేసినప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక ఎకరంలో విత్తనోత్పత్తి చేయాలంటే ఒకరికి రూ. 400 చొప్పున కనీసం 8 మంది కూలీలను నాలుగు నెలలు భరించాలి. పుప్పొడి రాల్చడం నుంచి మొదలుకొని కలుపు తీయడం, నీరుపెట్టడం పంట చివరాఖరు వరకు సుమారు రూ. 3 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు.. విత్తనోత్పత్తిలో 70శాతం మంది కౌలు రైతులే ఉన్నారు. కౌలు ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది.